న్యూఢిల్లీ, నవంబర్ 27: కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు చిల్లులు పడబోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ధరలను పెంచిన వాహన సంస్థలు మరోసారి పెంచడానికి సమాయత్తమవుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ, లగ్జరీ కార్ల సంస్థ ఆడీతోపాటు టాటా మోటర్స్ కూడా తన మాడళ్ల ధరలను సవరిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి. కమోడిటీ ఉత్పత్తుల ధరలు అధికమవడం, ద్రవ్యోల్బణ పెరగడంతో ధరలపై తీవ్ర ఒత్తిడి పడిందని, దీంతో ధరలు పెంచకతప్పడం లేదని మారుతి వర్గాలు వెల్లడించాయి. ఎంత శాతం మేర పెంచేదానిపై సంస్థ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల లోపు విక్రయిస్తున్నది.
ఆడీ రెండు శాతం వడ్డన
ఆడీ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికంకావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే జనవరి 1 నుంచి అన్ని మాడళ్ల విలువలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు తెలిపింది. సరఫరా కోసం అయ్యే ఖర్చులు అధికమవడం, మరోవైపు ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్లను ఆయా మాడళ్ల ధరలను సవరించాల్సి వచ్చిందని ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సంస్థ రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల లోపు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.
టాటా మోటర్స్ కూడా..
టాటా మోటర్స్ కూడా తన వాహన ధరలను పెంచేందుకు సమాయత్తమవుతున్నది. జనవరి నుంచి అమలులోకి వచ్చేలా ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరలను సవరించాలనుకుంటున్నది. ప్రస్తుతం సంస్థ రూ.5.6 లక్షల నుంచి రూ.25.94 లక్షల లోపు వాహనాలను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ ధరలను ఎంతమేర పెంచబోతున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మహీంద్రా, బెంజ్ కూడా..
దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వాహన ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నది. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరల ఆధారంగా ధరలను పెంచకతప్పడం లేదని మహీంద్రా సీఈవో నలినికాంత్ గొల్లగుంట తెలిపారు. ఎంతమేర పెంచేది మాత్రం వచ్చే నెల చివర్లో వెల్లడించనున్నది సంస్థ. అలాగే మరో లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా ధరల పెంపుపై ఆలోచిస్తుమంటున్నట్లు పేర్కొంది.