Maruti-Hyundai on Diesel Cars | కాలుష్య నియంత్రణకు డీజిల్ కార్లపై జీఎస్టీ తదితర సుంకాలు భారీగా పెంచింది కేంద్రం. ఫలితంగా డీజిల్ కార్ల కొనుగోలు ఖర్చు పెరిగిపోవడంతో వాటి విక్రయాలు తగ్గి వచ్చాయని లీడింగ్ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా పేర్కొన్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ పెంచాల్సిన అవసరం ఉందని మంగళవారం సియామ్ సదస్సులో కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తర్వాత సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో ప్రస్తుతానికి డీజిల్ వాహనాలపై జీఎస్టీ పెంపు ప్రతిపాదన లేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ .. ‘కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలు కఠినతరం చేయడంతో డీజిల్ కార్ల కొనుగోలు, వాడకం ఖర్చులు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో డీజిల్ కార్ల విక్రయశాతం రోజురోజుకు తగ్గిపోతున్నది` అని చెప్పారు.
పలు కార్ల తయారీ సంస్థలు డీజిల్ కార్ల తయారీ నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. 2013-14లో మొత్తం కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 53.2 శాతం. కానీ 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య డీజిల్ కార్ల విక్రయాలు 18.2 శాతానికి దిగి వచ్చాయి. డీజిల్, పెట్రోల్ కార్ల ధరల్లో తేడా చాలా తగ్గడంతోపాటు అదనపు పన్ను భారం వల్ల డీజిల్ కార్లతో వచ్చే ఎంజాయ్ చాలా తక్కువ. ఇక పెట్రోల్ కార్ల కంటే డీజిల్ కార్ల కొనుగోలు ఖర్చులో గతంలో రూ.90 వేల నుంచి లక్ష వరకూ తేడా ఉంటే.. ఇప్పుడు రూ.2 లక్షల వరకూ వస్తోంది. భారతీయుల ఆర్థిక స్థితిగతుల రీత్యా కూడా డీజిల్ కార్ల కొనుగోలు ఖర్చు ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తున్నది.
హ్యుండాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) తరుణ్ గార్గ్ స్పందిస్తూ జనవరి-ఆగస్టు మధ్య మొత్తం కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల విక్రయాలు 18 శాతానికి పరిమితం అయ్యాయని చెప్పారు. గతేడాది 30 శాతం మంది కస్టమర్లు డీజిల్ కార్లకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రెగ్యులేటరీ నిబంధనలతోపాటు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కార్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. డీజిల్ కార్ల వాడకాన్ని నిరుత్సాహ పరిచేందుకు పన్ను విధానంలో మార్పులు తేవాలన్న వైఖరికి మద్దతునిస్తామన్నారు. భారీ వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఎండీ కం సీఈఓ శేనూ అగర్వాల్ స్పందిస్తూ.. ఆటోమొబైల్ రంగం పురోభివ్రుద్ధికి.. ఆల్టర్నేటివ్ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలని, అందుకు మరిన్ని ప్రోత్సాహాలు అందించాలని పేర్కొన్నారు.