న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశవ్యాప్తంగా చిన్న కార్లకు ఆదరణ క్రమంగా తగ్గుతున్నది. కొనుగోలుదారుల అభిరుచులు క్రమంగా మారిపోతున్నాయి. సౌకర్యవంతంగా ఉండే మోడళ్ళను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో హ్యాచ్బ్యాక్ మోడళ్ళ విక్రయాలు గడిచిన మూడేండ్లుగా తగ్గుతూ వస్తున్నాయి. 2018 నుంచి దేశవ్యాప్తంగా చిన్న కార్ల విక్రయాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని దేశీయ కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. వచ్చే ఏడాది మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు.
కరోనాతో గత మూడేండ్లుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, 2018లో 22 లక్షల యూనిట్లు అమ్ముడవగా..ఈ సారి మాత్రం దీనికంటే అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇతర సెగ్మెంట్లు టాప్ గేర్లో దూసుకుపోతుంటే..చిన్న కార్ల సెగ్మెంట్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి లాగా అక్కడే ఉంటున్నదని ఆర్థిక ఫలితాలు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఉండటంతో రెండో త్రైమాసికంలో చిన్న కార్ల విక్రయాలు ఓ మోస్తారుగా ఉన్నాయన్నారు.
వచ్చే ఏడాది దేశీయ ఆటోమొబైల్ రంగం సింగిల్ డిజిట్కు పరిమితం కానున్నదని ఆయన ఆక్షేపించారు. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో వచ్చే ఏడాది 8 శాతం మాత్రమే వృద్ధిని సాధించనున్నదన్న ఆయన..గడిచిన మూడేండ్లకాలంలో విక్రయాలు 26 శాతం పడిపోయాయన్నారు.