దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ గతేడాది రికార్డు స్థాయిలో వాహన ఎగుమతులు చేసింది. 2021లో 2,05,450 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సోమవారం సంస్థ ప్రకటించింది. ఒక ఏడాది కాలంలో ఈ స్థాయిలో ఎగుమతులు చేయడం ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంస్థ దాదాపు 15 మోడళ్లను ఎగుమతి చేస్తున్నది. నిరుడు ఎగుమతుల్లో టాప్-5లో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బ్రెజ్జా ఉన్నాయి. 1986-87లో హంగేరీతో మొదలైన మారుతి ఎగుమతులు.. ఇప్పుడు 100కుపైగా దేశాలకు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 21.85 లక్షలకుపైగా వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇదిలావుంటే డిసెంబర్లో ఉత్పత్తి 2 శాతం తగ్గిందని సంస్థ తెలిపింది. 2020 డిసెంబర్లో 1,55,127 యూనిట్ల ఉత్పత్తి జరగగా, 2021 డిసెంబర్లో 1,52,029 యూనిట్లు తయారయ్యాయి.