Stocks in Loss | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఆరో రోజూ నష్టాలు వెంటాడాయి. అంతర్జాతీయ బలహీనతల ప్రభావం వెంటాడింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా నేలచూపులే చూశాయి. 2020 మే తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్లో 732 పాయింట్లు పతనమై చివరకు 135 పాయింట్ల నష్టంతో 51,360 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 కూడా67 పాయింట్లతో పతనమై 15,294 పాయింట్ల వద్ద స్థిర పడింది. నిఫ్టీలో బజాజ్ ట్విటన్స్, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపొలో హాస్పిటల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్క్రిప్టులు 0.26 నుంచి మూడు శాతం వరకు లాభ పడ్డాయి.
టైటాన్ కంపెనీ, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీ సిమెంట్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ ఆరు శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ రెండు శాతానికి పైగా నష్టపోతే, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.75 శాతం వరకు నష్టపోయింది.
మరోవైపు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం లోయర్లోనే ట్రేడింగ్ మొదలు పెట్టింది. టైటాన్, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ 2.6 నుంచి ఆరు శాతం నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ లాభ పడ్డాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.88 శాతం, మిడ్ క్యాప్ 0.68 శాతం, లార్జ్ క్యాప్ 0.65 శాతం నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మూడు శాతానికి పైగా నష్టపోగా, కన్జూమర్ డ్యూరబుల్స్ 2.68, ఎనర్జీ 1.86, పవర్ 1.59 శాతం నష్టాల్లో ముగిశాయి. 19 బీఎస్ఈ సెక్టార్ ఇండెక్స్ల్లో 15 నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి.