డాలర్ ఇండెక్స్, క్రూడ్ ధరలు క్రమేపీ దిగిరావడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం స్టాక్ మార్కెట్ల సానుకూలంగా ట్రేడయ్యాయి. దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా భారత్ సూచీలు సైతం పెరిగాయి. వారం ప్రథమార్థంలో నిఫ్టీ తీవ్ర ఒడిదుడుకులకు లోనై చివరకు 406 పాయింట్ల లాభంతో 15,699 పాయింట్ల వద్ద నిలిచింది. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లో విక్రయిస్తున్నా, డెరివేటివ్స్ విభాగంలో భారీ ఎత్తున షార్ట్ కవరింగ్ జరుపుతున్నందున మార్కెట్లు పెరిగాయని, ఈ వారం జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా మరిన్ని షార్ట్స్ కవర్ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు మరింత పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీతో ఎస్జీఎక్స్ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభాలతో ఉంది. దీంతో గ్యాప్అప్ ప్రారంభాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ పల్స్
కీలక నిరోధం 15,700
గతంలో పలు దఫాలు మద్దతునిచ్చిన 15,700 పాయింట్ల స్థాయి అప్ట్రెండ్ సమయంలో నిరోధంగా మారుతుందని, దీంతో ఈ వారం నిఫ్టీకి ఈ స్థాయి కీలకమని పలువురు విశ్లేషకులు తెలిపారు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 16,000 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనావేశారు. కొన్ని రంగాల షేర్లు పటిష్టంగా పెరిగినందున, ఈ డెరివేటివ్స్ ముగింపు వారంలో షార్ట్ కవరింగ్తో నిఫ్టీ 15,700పైన ముగిస్తే 16,000 పాయింట్లవరకూ ర్యాలీ జరుపుతుందని, 15,400-500 పాయింట్ల శ్రేణి మద్దతునివ్వవచ్చని ఏంజిల్ఒన్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చవాన్ తెలిపారు.