ఆరు రోజుల ట్రేడింగ్తో ముగిసిన గత వారం ప్రథమార్ధంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,124 పాయింట్ల కొత్త రికార్డు స్థాయిని చేరినంతనే, హఠాత్ పతనాన్ని చవిచూసి 21,286 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. తిరిగి కోలుకున్నా.. 309 పాయింట్లు క్షీణించి 21,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రెలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) బేరిష్ డైవెర్జన్స్ ప్రదర్శిస్తున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నాగరాజ షెట్టి తెలిపారు.
అయితే మూడు రోజుల ట్రేడింగ్కే పరిమితం కానున్న ఈ వారంలో జనవరి డెరివేటివ్ కాంట్రాక్టులు కూడా ముగియనున్నందున నిఫ్టీ ఒడిదుడుకులకు లోనవుతుందని అంచనా. కార్పొరేట్ ఫలితాలకు అనుగుణంగా హెచ్చుతగ్గుల తీవ్రత పెరగవచ్చని, హైబేటా స్టాక్స్లో పొజిషన్లను చెక్ చేసుకోవాలని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా ఇన్వెస్టర్లకు సూచించారు.
మద్దతు 21,500-నిరోధం 21,800
పుట్ రైటింగ్ భారీగా జరిగిన 21,500 పాయింట్ల వద్ద నిఫ్టీకి ఈ వారం కీలక మద్దతు ఉన్నదని, ఈ స్థాయి నుంచి రైటర్లు వైదొలిగితే 21,000 పాయింట్ల వరకూ తగ్గవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ అంచనా వేశారు. 21,700, 21,800 వద్ద షార్ట్ కవరింగ్ జరిగితే పెరగవచ్చ న్నారు. ఈ వారం 21,300 పాయింట్ల సమీపంలో మద్దతు పొందవచ్చని, 21,750-21,850 స్థాయిలు అవరోధం కల్గించవచ్చని షెట్టి విశ్లేషించారు.