కేంద్ర బడ్జెట్, అదానీ ఉదంతం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. అయితే గత శుక్రవారం షార్ట్ కవరింగ్ ప్రభావంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ పెద్ద ర్యాలీ జరపడంతో వారం మొత్తంమీద 250 పాయింట్లు లాభపడి 17,854పాయింట్ల వద్ద ముగిసింది. కానీ మన మార్కెట్ ముగిసిన తర్వాత అమెరికాలో వెల్లడైన సానుకూల జాబ్స్ డాటాతో అక్కడి మార్కెట్లు క్షీణించడంతో ఈ సోమవారం మన మార్కెట్ బలహీనంగా ప్రారంభంకావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదానీ గ్రూప్ వార్తలు వచ్చేవారం కూడా ఒడిదుడుకులకు లోనుచేయవచ్చని, అలాగే ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ప్రసంగంపై కూడా మార్కెట్ దృష్టి ఉన్నదని నిపుణులు చెపుతున్నారు. ఒకవైపు షార్ట్ కవరింగ్, మరోవైపు బుల్ ఆన్లోడింగ్తో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కీలక మద్దతు 17,500
ఈ వారం నిఫ్టీకి 17,500 వద్ద లభించబోయే మద్దతు కీలకంగా ఉంటుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా చెప్పారు. గతవారం రెండు, మూడు సందర్భాల్లో ఈ స్థాయిని ఇంట్రాడేలో కోల్పోయనా, ముగింపులో నిలుపుకున్నందున 17,500 పాయింట్ల మద్దతుస్థాయికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. అలాగే 17,700 పాయింట్ల స్థాయిపైన స్థిరపడగలిగితే 18,000-18,100 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. సాంకేతికంగా 20 వారాల మూవింగ్ ఏవరేజ్ కదులుతున్న 17,900 స్థాయిని, దీనికి సమీపంలో 17,950 వద్దనున్న 100 రోజుల మూవింగ్ ఏవరేజ్ దిగువన నిఫ్టీ కొనసాగినంతవరకూ మార్కెట్ బలహీనంగానే ఉంటుందని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు.