స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల నడుమ పెట్టుబడుల ఉపసంహరణలకే మదుపరులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 932.42 పాయింట్లు లేదా 1.11 శాతం పడిపోయి 82,500.47 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 311.15 పాయింట్లు లేదా 1.22 శాతం కోల్పోయి 25,149.85 దగ్గర ముగిసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను కార్పొరేట్ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను అధికంగా ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు.
బడా సంస్థలు లాభాలను అందుకున్నా.. నష్టాలను మూటగట్టుకున్నా.. సూచీలు కూడా అందుకు తగ్గట్టే స్పందిస్తాయన్న అభిప్రాయాల్ని మెజారిటీ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు ఆటుపోట్లకు గురికావచ్చు. ఇక ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, దేశీయ మార్కెట్లను నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. కానీ సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,400-25,600 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.