ముంబై, మార్చి 7: దేశీయ స్టాక్ మార్కెట్లపై క్రూడాయిల్ పిడుగు పడింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సూచీలపై తాజాగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం భారీ నష్టాలను మిగిల్చింది. ఇంట్రా డేలో 2 వేల వరకు నష్టపోయిన సెన్సెక్స్.. వరుసగా నాలుగోరోజు సోమవారం 1,491 పాయింట్లు పతనం చెంది 52,842.75 వద్ద నిలిచింది. నిఫ్టీ 16 వేల పాయింట్ల దిగువకు జారుకున్నది. 382.20 పాయింట్లు తగ్గి 15,863.15 వద్ద ముగిసింది. రెండు సూచీలు ఏడు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు అయింది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 3,404.53 పాయింట్లు పడిపోయింది. విదేశీ నిధులు వెళ్లిపోవడం మార్కెట్ల పతనాన్ని శాసించిందని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
11 లక్షల కోట్లు మటాష్
గడిచిన నాలుగు ట్రేడింగ్లలో మదుపరులు రూ.11.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,28,214.05 కోట్లు కరిగిపోయి రూ.2,41,10.831.04 కోట్లకు చేరుకున్నది. క్రూడాయిల్, రూపాయి దెబ్బతో మార్కెట్లు మూడు శాతం వరకు పతనమయ్యాయి.
రికార్డు కనిష్ఠానికి రూపాయి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో భారత్ కరెన్సీ రూపాయి విలువ రికార్డు కనిష్ఠస్థాయికి పడిపోయింది. సోమవారం అమెరికా డాలర్తో రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 83 పైసలు పతనమై 77 వద్ద ముగిసింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22నాడు నమోదైన 76.90 స్థాయి దిగువకు తాజాగా తగ్గింది. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర మరింతగా పెరగడం, స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వేగవంతం కావడంతో డాలర్లకు డిమాండ్ పెరిగిందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.