న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,773 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. విక్రయాలు టాప్ గేర్లో దూసుకుపోవడంతో గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,929 కోట్ల లాభంతో పోలిస్తే 44 శాతం వృద్ధిని కనబరిచింది. అటు కంపెనీ ఆదాయం కూడా రూ.21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి ఆదాయాన్ని ఆర్జించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
‘వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకోవడం వల్లనే ఆర్థిక ఫలితాల్లో రాణించగలిగాం. పండుగ సీజన్లో నూతన వాహనాలను కూడా విడుదల చేయడం సంస్థకు కలిసొచ్చింది.
– అనిశ్ షా, ఎం అండ్ ఎం మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో