న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,360.79 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఆటోమోటివ్, వ్యవసాయ ఉత్పత్తుల విభాగం అంచనాలకుమించి పనితీరు కనబర్చడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.331.74 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.19,171.91 కోట్ల నుంచి రూ.28,412.38 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
దీంట్లో ఆటోమోటివ్ విభాగం నుంచి రూ.12,740.94 కోట్ల ఆదాయం సమకూరగా, అదే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంతో రూ.8,427.66 కోట్లు లభించాయి. నిర్వహణ ఖర్చులు రూ.20,286.24 కోట్ల నుంచి రూ.26,195.01 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. నికరంగా గత త్రైమాసికంలో సంస్థ 1,49,803 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది విక్రయించిన 85,858 యూనిట్లతో పోలిస్తే 74 శాతం అధికమని పేర్కొంది. అలాగే 1,17.143 ట్రాక్టర్లను కూడా విక్రయించింది. ఈ సందర్భంగా ఎంఅండ్ఎం ఎండీ, సీఈవో అనిశ్ షా మాట్లాడుతూ..గ్రూపునకు సంబంధించిన అన్ని వర్టికల్స్ ఆశాజనక పనితీరు కనబరిచాయని, ముఖ్యంగా వాహన, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక డిమాండ్ నెలకొన్నదని చెప్పారు. అలాగే ఆర్థిక సేవలు అందించడంతో సంస్థకు రూ.2,876.61 కోట్ల ఆదాయం సమకూరగా, అలాగే ఆతిథ్య రంగం నుంచి రూ.613.19 కోట్లు లభించాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం నిరాశాజనక పనితీరు కనబరిచింది. ఈ రంగం నుంచి కేవలం రూ.95 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరినట్లు కంపెనీ వెల్లడించింది.