Mahindra EV SUV XUV400 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా.. తొలి ఏడాది 20 వేల ఎలక్ట్రిక్ ఎస్యూవీ `ఎక్స్యూవీ400`కార్లు డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించిన కారు ప్రారంభ ధర రూ.15.99 లక్షల నుంచి మొదలు కానున్నది. గతేడాది సెప్టెంబర్లో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తొలి దశలో దేశంలోని ఈ కారు రెండు వేరియంట్లను 34 నగరాల్లో మార్కెట్లోకి తేవాలని నిర్ణయించినట్లు సంస్థ ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ఈ నెల 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
మార్చి నుంచి ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీ ప్రారంభం కానున్నది. ఈసీ వేరియంట్ కారు దీపావళి ఫెస్టివ్ సీజన్లో తీసుకు రానున్నది. ఈసీ వేరియంట్ 375 కి.మీ. ప్రయాణ సామర్థ్యంతో కూడిన 34.5 కిలోవాట్ల బ్యాటరీతో వస్తున్నది. ఈసీ వేరియంట్ రెండు చార్జింగ్ ఆప్షన్లలో లభ్యం కానున్నది. 3.3 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం గల కారు రూ.15.99 లక్షలు, 7.2 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం గల కారు రూ.16.49 లక్షలకు కొనుక్కోవచ్చు.
మరోవైపు ఈఎల్ ట్రిమ్ వేరియంట్ కారు 39.4 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో 456 కి.మీ. దూరం ప్రయాణించగల రేంజ్తో వస్తున్నది. 7.2 కిలోవాట్ల చార్జర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.18.99 లక్షలు ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఈసీ, ఈఎల్ వేరియంట్లపై తొలి 5000 బుకింగ్స్కు ప్రారంభ ధరలు వర్తిస్తాయని తెలిపింది.
టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీకి మహీంద్రా ఎక్స్యూవీ 400 ఎస్యూవీ గట్టి పోటీ ఇవ్వనున్నది. టాటా మోటర్స్ నెక్సాన్ ఈవీ కారు రూ.14.99 లక్షల నుంచి రూ.20.04 లక్షల మధ్య పలుకుతున్నది.