న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశీయ జీవిత బీమా పరిశ్రమలో మెజారిటీ వాటా కలిగిన ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లో మాత్రం నేలచూపులు చూస్తున్నది. స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి ఏడాది పూర్తికాకముందే రూ.2.08 లక్షల కోట్ల షేర్హోల్డర్ల సంపదను హరించివేసింది. రూ.5.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో నిరుడు మే 17న లిస్టయిన ఎల్ఐసీ విలువ ఈ ఏడాది ఏప్రిల్ 21నాటికి రూ.3.46 లక్షల కోట్లకు పడిపోయింది. లిస్టింగ్ రోజున అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీల జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఎల్ఐసీ ఇప్పుడు చతికిలాపడిపోయి టాప్-10లో కూడా లేదు. 13వ స్థానానికి సంస్థ విలువ దిగజారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో రిటైల్ ఇన్వెస్టర్లు, ఏజెంట్లు, ఆ సంస్థ ఉద్యోగుల నుంచి ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్లోకి ఆకర్షించిన మదుపులో దాదాపు సగం మాయమైపోయింది.
ఎల్ఐసీ ఐపీవోకు రూ.949 భారీ ధరను నిర్ణయించిన కేంద్రం రిటైలర్లు, సంస్థ ఉద్యోగులకు మాత్రం రూ.904 డిస్కౌంట్ ధరతో షేర్లను ఇచ్చింది. కానీ లిస్టయినప్పటి నుంచి ఏ రోజూ ఎల్ఐసీ షేరు కనీసం ఐపీవో ధరను తాకలేకపోయింది. లిస్టింగ్ రోజున కొద్ది క్షణాలపాటు రూ.918 గరిష్టానికి చేరిన తర్వాత క్రమేపీ తగ్గుతూనే వస్తున్నది. గత శుక్రవారం బీఎస్ఈలో ఈ షేరు రూ.548 వద్ద ముగిసింది. ఇప్పటికే పబ్లిక్ ఆఫర్ ధరతో పోలిస్తే 42 శాతం పతనాన్ని చవిచూసింది. రిటైలర్లకు ఇచ్చిన డిస్కౌంట్ ధర నుంచి కూడా 39.4 శాతం నష్టపర్చింది. డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ధరతో ఎల్ఐసీ ఐపీవోకు రావడం షేరు పతనానికి నాంది పలికిందని మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఈ అధిక ధర కారణంగా అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఐసీ షేర్ల కోసం పోటీపడలేదని, ఎల్ఐసీ పేరు ప్రతిష్ఠలను చూసి కేవలం రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే ఆకర్షితులయ్యారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
ఎల్ఐసీ 2022 డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించినప్పటికీ, ఆ షేరు పతనబాటలోనే పయనిస్తున్నది. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకూ నాలుగున్నర నెలల్లో ఎల్ఐసీ షేరు రూ.746 నుంచి 26.5 శాతం నష్టపోయింది. ఈ మధ్యకాలంలో బీఎస్ఈ సెన్సెక్స్ తగ్గింది 1.65 శాతమే. ముఖ్యంగా 2023లో జరిగిన పతనానికి ప్రధాన కారణం ఎల్ఐసీకి అదానీ గ్రూప్లో ఉన్న భారీ పెట్టుబడులే కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. దేశంలో ఏ పెద్ద మ్యూచువల్ ఫండ్ చేయనంత భారీగా ఎల్ఐసీ అదానీ గ్రూప్లో పెట్టుబడులు చేసింది. ఈ గ్రూప్ అవకతవకలపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్ గ్రూప్ నివేదిక ఈ జనవరి 24న వెలువడిన తర్వాత అదానీ షేర్లు నిలువునా పతనమైన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ సగమై రూ.81,000 కోట్ల నుంచి రూ. 40,000 కోట్లకు పడిపోయింది. ఈ ఉదంతం సైతం ప్రస్తుత ఏడాది ఎల్ఐసీ షేరు అధ్వాన్నంకావడానికి కారణమయ్యింది.
మరోవైపు జీవిత బీమా పరిశ్రమలో ఎల్ఐసీ వాటా క్రమేపీ తగ్గడం, ప్రైవేటు బీమా సంస్థలు వాటా పెంచుకోవడం కూడా ఈ షేరుపై ప్రతికూల ప్రభావం కనపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కేవలం ఆరు నెలల్లో 4.45 శాతం మార్కెట్ వాటాను ఈ ప్రభుత్వ బీమా దిగ్గజం కోల్పోయింది. జీవిత బీమా వ్యాపారంలో నిరుడు సెప్టెంబర్లో 68.25 శాతం ఉన్న ఎల్ఐసీ వాటా ఈ ఏడాది ఫిబ్రవరికల్లా 63.8 శాతానికి తగ్గింది. ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్బీఐ లైఫ్, మ్యాక్స్ లైఫ్లు క్రమేపీ వాటాను పెంచుకుంటున్నాయి.