హైదరాబాద్, అక్టోబర్ 28: సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి, ప్రజలకు, పాలసీదార్లకు బాసటగా నిల్చిన బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిష్ఠను ఒక్కదెబ్బతో నరేంద్ర మోదీ ప్రభుత్వం మసకబార్చింది. ఒకవైపు పాలసీదార్లకు భరోసానిస్తూ, మరోవైపు పెద్ద మౌలిక ప్రాజెక్టులకు రుణాలిస్తూ, ప్రభుత్వ బాండ్లలోకి భారీ పెట్టుబడులు మళ్లిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటుగా నిలుస్తున్న ఎల్ఐసీ పరపతిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వల్ప లబ్దికోసం దిగజార్చింది. కేంద్రం కేవలం తన డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యంలో కొద్ది భాగాన్ని పూడ్చుకునేందుకు ఎల్ఐసీ షేర్లను విక్రయించి, అటు సంస్థ పరువును మంటగలిపి, ఇటు ఆ షేర్లలో పెట్టుబడి చేసిన లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బతీసింది. ఎల్ఐసీ పాలసీ తీసుకుని, ఏ మాత్రం ఆందోళనచెందకుండా భరోసాతో సంవత్సరాల తరబడి వేచిచూసేవారు సైతం భీతిల్లేలా నెలలకాలంలోనే రిటైల్ మదుపరులు ఎల్ఐసీకి గుడ్బై చెపుతున్నారంటే సంస్థకు ప్రధాన మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ల దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్థం చేసుకోవొచ్చని విశ్లేషకులు వాపోతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణంతో ప్రపంచమంతా మార్కెట్ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నిధుల కోసం వెంపర్లాడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఎల్ఐసీ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి, బడ్జెట్లో నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరడానికి అధిక ధరతో ఎల్ఐసీ ఐపీవో జారీచేసి ఖజానాను నింపుకుంది. ప్రపంచంలోనే నంబర్వన్ జీవితబీమా సంస్థగా గుర్తింపు ఉన్న ఎల్ఐసీని అంతర్జాతీయంగా, దేశీయంగా దిగజార్చింది. రూ.14-15 లక్షల కోట్ల విలువతో ఐపీవోకు వస్తామంటూ ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల ఫలితంగా రూ.6 లక్షల కోట్ల విలువతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. లిస్టింగ్ తర్వాత దేశంలో అత్యంత విలువైన మూడు కంపెనీల్లో ఎల్ఐసీ ఒకటిగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు ఊదరగొట్టారు. ప్రస్తుతం సంస్థ మార్కెట్ విలువ రీత్యా 14వ స్థానంలోకి జారిపోయింది.
అలవికాని సమయంలో అధిక ధరతో ప్రభుత్వం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ తేవడం సంస్థ విలువను దెబ్బతీసిందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. భారీ నిధుల్ని సమీకరించాలన్న ఆశతోనే ప్రభుత్వం తొందరపడిందన్నారు. అప్పటికే ట్రేడవుతున్న ఇతర ప్రైవేట్ రంగ బీమా సంస్థల కంటే ఎక్కువ ధరతో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీచేశారని జీసీఎల్ సెక్యూరిటీస్ సీఈవో రవి సింఘాల్ అన్నారు.
ఎల్ఐసీ షేర్లపై నమ్మకం ఒమ్ముకావడంతో చిన్న మదుపరులు సంవత్సరమైనా గడవకముందే సంస్థ గడప దాటేస్తున్నారు. అది లిస్టయిన నాలుగు నెలల్లోనే 4.5 లక్షల మందికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు వారివద్దనున్న ఎల్ఐసీ షేర్లను పూర్తిగా విక్రయించుకున్నారు. స్టాక్ ఎక్సేంజీలకు ఎల్ఐసీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 2.65 లక్షల మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ పెట్టుబడుల నుంచి వైదొలిగారు. 2022 మే 17న ఎల్ఐసీ లిస్టయిన తర్వాత కేవలం 43 రోజుల్లోనే జూన్ 30కల్లా 2 లక్షలకు పైగా మదుపరులు వారి షేర్లను నష్టాలకు విక్రయించుకున్నారు. ఐపీవోలో 39.86 లక్షల మంది ఇన్వెస్టర్లు 10.51 కోట్ల షేర్లను కొన్నారు. ఇప్పుడా రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 35.23 లక్షలకు పడిపోయింది. ఎల్ఐసీ ఐపీవో ధర రూ.949కాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్తో రూ.904 ధరపై షేర్ల కేటాయింపు జరిగింది. ఈ శుక్రవారం (అక్టోబర్ 28) నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో ఎల్ఐసీ షేరు ధర రూ. 593 వద్ద ముగిసింది. పెట్టుబడి పెట్టి ఆరు నెలలు నిండకముందే రిటైల్ ఇన్వెస్టర్ల పొదుపు సొమ్ములో 35 శాతం ఆవిరైపోయింది. గరిష్టంగా 210 షేర్లు కేటాయింపు పొందిన రిటైల్ మదుపరులు ఈ ఐదు నెలల్లో దాదాపుగా రూ.65వేలకు పైగా నష్టపోయారు.
పాలసీదార్లకు వారి పాలసీల అమలుకాలంలో రక్షణకు, కాలపరిమితి ముగిసిన తర్వాత చెల్లింపుల కోసం సురక్షితమైన సాధనాల్లో పెట్టుబడిగా ఉంచే ఎల్ఐసీని ఆ సోమ్ము తీసి ఇన్వెస్టర్లకు పంచాలంటూ తాజాగా ప్రభుత్వం ఉసిగొల్పుతున్నదన్న వార్తలు వెలువడుతున్నాయి. అత్యంత విలువైన పాలసీదార్ల సొమ్ముకాస్తా ఇన్వెస్టర్లకు మళ్లించడం రిస్కేనని పరిశ్రమ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలసీదార్ల నిధుల నుంచి దాదాపు 22 బిలియన్ డాలర్లు (రూ.1.81 లక్షల కోట్లు) ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచడానికి డివిడెండ్లు, బోనస్ రూపంలో పంచాలన్న ప్రతిపాదన ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఎల్ఐసీ షేరు ధరను పునరుద్ధరించే చర్యల్ని చేపట్టాలని చూస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.