న్యూఢిల్లీ, జనవరి 25: బలహీన ఆర్థిక ఫలితాలతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్న ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు రిజర్వ్బ్యాంక్ అనుమతి ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చెల్లింపు మూలధనంలో 9.99 శాతానికి వాటా పెంచుకునే అనుమతి కోరుతూ తాము చేసుకున్న దరఖాస్తును ఆర్బీఐ గురువారం ఆమోదించినట్టు ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాంక్లో ఎల్ఐసీకి 5 శాతం మేర వాటా ఉన్నది.
ఆర్బీఐ నియంత్రణల మేరకు ఒక ఏడాదిలోపుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వాటాను ఎల్ఐసీ 9.99 శాతానికి పెంచుకోవచ్చు. అయితే ఆ పరిమితిని దాటకూడదు. ఈ బ్యాంక్లో మెజారిటీ వాటా (52 శాతం) విదేశీ ఇన్వెస్టర్ల వద్దే ఉన్నది. జనవరి 16న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాల్ని వెల్లడించిన తర్వాత ఇప్పటివరకూ ఆ షేరు 15 శాతంపైగా పతనమయ్యింది. ఎల్ఐసీకి ఆర్బీఐ నుంచి లభించిన తాజా అనుమతితో షేరు క్షీణతకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందన్న అభిప్రాయాల్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. గురువారం ఈ షేరు 1.44 శాతం తగ్గి రూ.1,435 వద్ద ముగిసింది.