న్యూఢిల్లీ, జనవరి 16: ఏడాదికాలంగా వివాదాలకు కేంద్ర బిందువైన అదానీ గ్రూప్ షేర్లను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) క్రమేపీ తగ్గించుకుంటున్నది. ముఖ్యంగా మూడు అదానీ కంపెనీలు..అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ వాటాల్ని పెద్ద మొత్తంలో విక్రయించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో ఈ మూడు కంపెనీలకు చెందిన 3.73 కోట్ల షేర్లను ఎల్ఐసీ వదిలించుకుంది. గౌతమ్ అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదంటూ గత ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత ఈ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఎల్ఐసీ ద్వారా అదానీ షేర్లను కొనిపిస్తున్నదంటూ పలు రాజకీయ పక్షాలు ఆరోపించిన విషయం విదితమే. 2023 జనవరి 27నాటికి అదానీ గ్రూప్ షేర్లలో ఎల్ఐసీకి రూ.56,142 కోట్ల విలువైన పెట్టుబడులు ఉండగా, జూన్కల్లా ఇవి రూ.30,000 కోట్లలోపునకు తరిగిపోయాయి. తదుపరి స్టాక్ మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ గ్రూప్ షేర్లు సైతం క్రమేపీ పెరగడంతో 2023 సెప్టెంబర్ చివరినాటికి వీటి విలువ రూ.45,025 కోట్లకు చేరింది. అటుతర్వాత మరింత ర్యాలీ జరిగిన కారణంగా కొన్ని అదానీ కంపెనీల షేర్లను ఎల్ఐసీ విక్రయిస్తూ వచ్చింది. విక్రయ వివరాలు
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: క్యూ2లో 3.68 శాతంగా ఉన్న వాటాను క్యూ3లో 3 శాతానికి తగ్గించుకున్నది. ఈ త్రైమాసికంలో అదానీ ఎనర్జీ షేరు 42 శాతం పెరిగింది.
అదానీ ఎంటర్ప్రైజెస్: గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసీ వాటా 4.23 శాతం నుంచి 3.93 శాతానికి తగ్గింది. క్యూ3లో ఇది 29 శాతం ర్యాలీ చేసింది.
అదానీ పోర్ట్స్: అదానీ గ్రూప్ కంపెనీలన్నింటిలోకి అదానీ పోర్ట్స్లోనే కార్పొరేషన్కు అధిక వాటా ఉన్నది. క్యూ2లో 9.07 శాతం ఉండగా, క్యూ3లో ఇది 7.86 శాతానికి తగ్గింది. ఈ షేరు డిసెంబర్ త్రైమాసికంలో 46 శాతం ఎగిసింది.
ఇతర అదానీ స్టాక్స్..ఏసీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ల్లో ఎల్ఐసీ వాటా యథాతథంగా ఉన్నది. క్యూ2ఓ 4,500 అంబూజా సిమెంట్స్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ కంపెనీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయకముందు నుంచి ఎల్ఐసీకి 6 శాతం మేర వాటా ఉన్నది.