LIC | న్యూఢిల్లీ, జనవరి 17: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసీ తన స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుంది. బుధవారం మార్కెట్ ట్రేడింగ్ తొలిదశలో ఎల్ఐసీ షేరు రూ. 900 స్థాయిని మించడంతో మార్కెట్ విలువ రూ.5.64 లక్షల కోట్లకు చేరగా, అదే సమయంలో రూ.635 ధరతో షేరు ట్రేడయినపుడు ఎస్బీఐ విలువ రూ.5.63 లక్షల కోట్లుగా ఉన్నది. తదుపరి మార్కెట్ ముగింపులో ఈ రెండు షేర్లూ క్షీణించి రూ.887, రూ. 526 స్థాయిల వద్ద నిలిచాయి. ముగింపు సమయానికి ఎల్ఐసీ విలువ రూ.5.60 లక్షల కోట్లుకాగా, ఎస్బీఐ విలువ రూ. 5.58 లక్షల కోట్లు.
ఎల్ఐసీ అత్యంత విలువైన పీఎస్యూ అయినప్పటికీ, ఐపీవోలో మదుపుచేసిన ఇన్వెస్టర్లకు ఇప్పటివరకూ ఏమాత్రం రాబడిని ఇవ్వలేకపోయింది. పబ్లిక్ ఆఫర్లో కేంద్ర ప్రభుత్వం షేర్లను విక్రయించిన కొద్ది నెలలకే ఇది రూ.530 స్థాయికి పతనమై ఇన్వెస్టర్ల సంపదను కరిగించివేసింది. అయితే ఒకటిన్నర సంవత్సరానికి ఎట్టకేలకు దాదాపు ఐపీవో ధరకు ఎల్ఐసీ షేరు చేరగలిగింది. బుధవారం ఎల్ఐసీ షేరు ఇంట్రాడేలో రూ. 917 స్థాయికి పెరిగిన అనంతరం రూ. 887 వద్ద ముగిసింది. ఎల్ఐసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉన్నది. 2022 మే నెలలో షేరుకు రూ. 949 ధరతో ఆఫర్ జారీచేయగా, చిన్న ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్తో షేర్లను కేటాయించారు. రూ.875 ధరతో ఇది లిస్టయ్యింది.