న్యూఢిల్లీ, డిసెంబర్ 23: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంజూరు చేయడంతో శుక్రవారం ఆ షేరు ఒక్కసారిగా పెద్ద ర్యాలీ జరిపింది. ఇంట్రాడేలో 6 శాతంపైగా పెరిగి 52 వారాల గరిష్ఠస్థాయి రూ.821 వద్దకు చేరింది. ట్రేడింగ్ ముగింపులో కొంతమేర లాభాల్ని కోల్పోయి చివరకు రూ.792 వద్ద నిలిచింది.
ఎల్ఐసీ మలి పబ్లిక్ ఆఫర్ ఇప్పట్లో జారీకాదన్న అంచనాలు షేరు పెరుగుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ షేర్లను మరోదఫా విక్రయిస్తే, మార్కెట్లో ఫ్లోటింగ్ ఈక్విటీ పెరిగి షేరు వృద్ధికి అడ్డంకిగా మారుతుందన్న ఆందోళన ఇప్పటివరకూ ఇన్వెస్టర్లలో ఉందని, ఇప్పుడది తొలగిపోవడంతో తాజా ర్యాలీ జరిగిందని వారు వివరించారు.