న్యూఢిల్లీ, జూన్ 10: మార్కెట్ కోరుకుంటున్నపుడే ప్రభుత్వ రంగ కంపెనీలను ఏ దేశమైనా విక్రయిస్తుంది. అంతేగానీ ప్రభుత్వానికి నిధులు అవసరమైనపుడు కాదు. మార్కెట్ వద్దంటున్నా సాహసోపేతంగా దీనికి రివర్స్లో వెళ్లిన కేంద్ర ప్రభుత్వం ఖజానాకు అంతంతమాత్రంగానే నిధులు సమకూర్చుకుంది. మరోవైపు పబ్లిక్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇమేజ్ను భారీగా దెబ్బతీసింది. ఎల్ఐసీ వాటా విక్రయానికి పలు వర్గాల నుంచి ఎంతో వ్యతిరేకత వస్తున్నా, భారీ విలువను రాబడతామంటూ ఘనంగా ప్రచారం చేసుకున్న కేంద్రం, చివరకు అడుగంటిన విలువకు అమ్మేసింది. రూ.16 లక్షల కోట్లకుపైగా విలువకు విక్రయిస్తామంటూ ఢంకా భజాయించి, ఇప్పుడు రూ.6 లక్షల కోట్ల విలువతోనే షేర్లను విక్రయించింది. ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన తర్వాత రూ.1,48,000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయింది. అమెరికా, భారత్లలో వడ్డీ రేట్ల పెరుగుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మార్కెట్లో అనిశ్చితి తదితర కారణాలతో ఈ షేరు శుక్రవారం నాడు అత్యంత కనిష్ఠస్థాయి రూ.708 వద్దకు పడిపోయింది. రూ.949 ధర వద్ద పబ్లిక్ ఇష్యూ జారీకాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45, పాలసీదారులకు రూ. 60 చొప్పున డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఆ డిస్కౌంట్ కాస్తా ఇప్పుడు వారికి ప్రీమియం అయిపోయింది. లిస్టయిన తర్వాత 25 శాతం పతనమై భారీ నష్టాల్ని మిగిల్చింది.
ముగ్గులోకి రిటైలర్లు
ఎంబడెడ్ విలువకు 2-3 రెట్లు అధికంగా ఎల్ఐసీ మార్కెట్ విలువ ఉంటుందంటూ రిటైల్ ఇన్వెస్టర్లను ఊరించిన కేంద్రం, చివరకు అంతర్జాతీయ అడ్వయిజర్ మిల్లీమాన్ నిర్ధారించిన రూ.5.40 లక్షల కోట్లకు కాస్త ఎక్కువ విలువపై షేర్లు విక్రయించింది. సహజంగానే ప్రభుత్వం మాటల్ని పూర్తిగా విశ్వసించిన రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీదారులు, చివరకు ఆ సంస్థ ఉద్యోగులు ఎల్ఐసీ ఐపీవోలో భారీగా పాలుపంచుకున్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగానే తమ షేరు బాగా పెరుగుతుందని విశ్వసించారు. ఇప్పుడు ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.4.49 లక్షల కోట్లకు పడిపోయింది. ఇలా ఇన్వెస్టర్ల నష్టాలకు, దిగ్గజ కంపెనీ విలువ కోల్పోవడానికి కేంద్ర డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ, విఫల ఆర్థిక విధానాలే కారణమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం స్టాక్ మార్కెట్కు షాక్ అబ్జార్బర్స్గా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం చూస్తుంటే, కేంద్రం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియలోకి రిటైల్ ఇన్వెస్టర్లను లాగాలని ప్రయత్నిస్తున్నట్లుందని విశ్లేషకులు వాపోతున్నారు. రిటైలర్లను ఇలా ఆకర్షించడం పిరమిడ్ పొంజి స్కీములాంటిదేనని ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేశారు.
లక్ష్యం తగ్గించినా, నెరవేరడం అనుమానమే
కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సంస్థల విక్రయాల ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకుంది. నిరుటి లక్ష్యం రూ.1,75,000 కోట్లలో 8 శాతం మాత్రమే సాధించింది. దీంతో తత్వం బోధపడిన తర్వాత ప్రస్తుత ఏడాదికి లక్ష్యాన్ని బాగా కుదించింది. ఇందులో రూ.20,560 కోట్లు ఎల్ఐసీ షేర్ల విక్రయంతో సమీకరించుకోగా, మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయడం అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పెట్రో మార్కెటింగ్ సంస్థ బీపీసీఎల్ డిజిన్వెస్ట్మెంట్ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, క్యూలో ఉన్న ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్, కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ తదితరాల వాటా విక్రయం డోలాయమానంలో పడింది. డిజిన్వెస్ట్మెంట్ నత్తనడకన నడవడానికి కారణం ప్రభుత్వ విధానాలేనని, పలు పీఎస్యూలు స్టాక్ మార్కెట్లో లిస్టయినా, వాటి యాజమాన్యం ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని, నిర్వహణా శైలిని ప్రభుత్వం లేదా బ్యూరోక్రసీ శాసిస్తాయని విశ్లేషకులు వాపోతున్నారు. స్వతంత్రంగా వ్యాపారం చేసే స్వేచ్ఛ వాటికి ఉండదు. అందుకే గెయిల్, ఓఎన్జీసీ వంటి గుత్తాధిపత్య వ్యాపారంలో ఉన్న దిగ్గజాలను సైతం స్టాక్ మార్కెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఆ షేర్లలో పెట్టుబడుల్ని ప్రోత్సహించరు.
సాహసాలన్నీ వైఫల్యాలే
డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ఇన్వెస్టర్లకు పీఎస్యూ షేర్లతో చేసిన పెళ్లి ఇప్పుడు పెటాకులయ్యే పరిస్థితి ఉంది. ఇదొక్కటే కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన సాహసాలన్నీ వైఫల్యాలుగానే మిగిలిపోయాయని, ఎంతో సమయం, నిధులు వృధా అయిపోయాయని విశ్లేషకులు పలు ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నారు. పెద్ద నోట్లను రద్దుచేసి ప్రజల్ని ఇబ్బందులు పాలుచేసిన డీమానిటైజేషన్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిల పరిష్కారానికి రూపొందించిన ఫ్రేమ్వర్క్, వ్యవసాయ చట్టాల ఉపసంహరణపై ఆడిన రాజకీయ జూదం వంటివన్నీ దారుణంగా విఫలమయ్యాయి. ఇలాంటి విధానాలతో అయోమయ పరుస్తుంటే మార్కెట్ ఎందుకు అవకాశాలిస్తుందన్నది విశ్లేషకుల ప్రశ్న.
ఆందోళనకరమే.. దీపం కార్యదర్శి పాండే
దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రతిష్ఠాత్మకంగా నమోదైన ఎల్ఐసీ షేర్ విలువ పతనంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. షేర్ ధర క్షీణత తాత్కాలికమేనని పైకి చెప్తున్నా.. లోలోపల మాత్రం మోదీ సర్కారు భీతిల్లుతున్నది. షేర్హోల్డర్ల విలువ పెంచే అవకాశాలను పరిశీలించాలని ఎల్ఐసీని కేంద్రం కోరుతుండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనించి ఎల్ఐసీ యాజమాన్యం షేర్హోల్డర్ల వాల్యూను పెంచుతుందన్న ఆశాభావాన్ని శుక్రవారం ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వ్యక్తం చేశారు. మదుపరులు ఎల్ఐసీ ఫండమెంటల్స్ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందన్న ఆయన ఈ నష్టాలు త్వరలోనే పూడ్చుకోగలమన్న విశ్వాసాన్ని కనబర్చారు.
ఎంబెడెడ్ వాల్యూపై..
ఇదిలావుంటే ఈ నెలాఖరుకల్లా ఎల్ఐసీ ఎంబెడెడ్ వాల్యూ అప్డేట్ అవుతుందని పాండే చెప్తున్నారు. మార్చి ఆఖరు నాటికి పరిగణనలోకి తీసుకుంటే మంచి విలువ రాగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెబీకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం ఎల్ఐసీ ఎంబెడెడ్ వాల్యూ నిరుడు సెప్టెంబర్ నాటికి రూ.5.39 లక్షల కోట్లుగా ఉన్న సంగతి విదితమే. గత నెల 17న స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ షేర్లు లిస్టింగైన విషయం తెలిసిందే. ఇష్యూ ధర రూ.949గా ఉంటే, ఒక్కో షేర్ రూ.872కే నమోదైంది. అప్పట్నుంచి రోజుకింత దిగజారుతూ ప్రస్తుతం బీఎస్ఈలో రూ.709.7 వద్దకు వచ్చింది. కాగా, షేర్హోల్డర్ వాల్యూ పెంచితే అధిక స్టాక్ ధర లభించనున్నది. మరింతగా డివిడెండ్లను అందుకునే వీలుంటుంది.