LIC | న్యూఢిల్లీ, మే 16: దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టి, మదుపరులను ముగ్గులోకి దించిన షేరు ఏడాదిలో నిండా ముంచేసింది. కేవలం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్రం హడావుడిగా వాటాల్ని అమ్ముకునేందుకు తీసుకొచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవో లిస్టయ్యి ఒక ఏడాది పూర్తయ్యింది. ఐపీవో ధర రూ.949తో పోలిస్తే 2022 మే 17న తక్కువగా రూ.865 వద్ద లిస్టయ్యి, తొలిరోజే ఇన్వెస్టర్లకు నష్టాల్ని చూపించింది. చిన్న ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లకు ఆఫర్ చేసిన డిస్కౌంట్ ధరకంటే అగ్గువకే ఈ బీమా దిగ్గజం లిస్టింగ్ జరిగింది.
ఈ ఏడాది ముగిసిన తర్వాత కూడా లిస్టింగ్ ధరకంటే 34 శాతం, ఐపీవో ధరకంటే 40 శాతం తక్కువకు ట్రేడవుతూ మదుపరుల పొదుపును మింగేసింది. స్టాక్ సూచీలు ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి 3-4 శాతం దూరంలో కదులుతున్నప్పటికీ, ఎల్ఐసీ షేరు మాత్రం ప్రస్తుతం ఏడాది కనిష్ఠం వద్దే కదులుతున్నది. మంగళవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో ఎల్ఐసీ షేరు రూ.568 స్థాయిలో నిలిచింది. ఈ ఏడాది కాలంలో ఎల్ఐసీ గరిష్ఠ ధర రూ.918 కాగా, రూ.530 వద్ద కనిష్ఠస్థాయిని 2023 మార్చి 29న నమోదు చేసింది.
కొనాలా? అమ్మాలా?
లిస్ట్ అయిన ఏడాదికాలంలోనే 40 శాతం పడిపోయి, కనిష్ఠస్థాయి వద్ద ట్రేడవుతున్న ఎల్ఐసీ షేరును కొనాలా? లేక ఉన్న షేర్లను నష్టానికి విక్రయించుకోవాలా అనే డైలమాలో పలువురు చిన్న ఇన్వెస్టర్లు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకులు సానుకూల సూచనలు ఇస్తున్నారు. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల దృష్ట్యా ఈ స్థాయిలో ఎల్ఐసీ షేరు కొనుగోలు చేయడం మంచి పెట్టుబడే కాగలదని వారంటున్నారు. బీమా మార్కెట్ చాలా పెద్దదని, ఎల్ఐసీతో పాటు ఇతర జీవిత బీమా సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడె
న్షియల్, ఎస్బీఐ లైఫ్లకు వృద్ధి అవకాశాలుంటాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌరాంగ్ షా చెప్పారు. దీర్ఘకాలిక దృష్టితో ఎల్ఐసీ షేరుకు తాము బై రేటింగ్ ఇస్తున్నామని తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనల కారణంగా జీవిత బీమా రంగంపై ప్రతికూల ప్రభావం కొద్దికాలమే ఉంటుందని, దీర్ఘకాలానికి ఈ రంగాల షేర్లలో పెట్టుబడి రాబడుల్ని ఇస్తాయని ఆయన అంచనా వేశారు.
బీమా కంపెనీలకు ఆర్థిక మంత్రి దెబ్బ
ఎల్ఐసీ విలువ అంత, ఇంత అంటూ రోడ్షోల్లో ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వమే తాజా బడ్జెట్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో పాటు ఇతర జీవిత బీమా కంపెనీల్లో పెట్టుబడులకు నీళ్లు చల్లింది. వివిధ ఇన్సూరెన్స్ పథకాల్లో చేసే పెట్టుబడులకు ఎటువంటి పన్ను మినహాయింపులూ లేని కొత్త పన్ను పద్ధతివైపు ఉద్యోగులు మళ్లే రీతిలో బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు చేశారు. మొత్తం జీవిత బీమా రంగాన్నే ఈ ప్రతిపాదనలు దెబ్బతీశాయి. ఎల్ఐసీ వృద్ధి అవకాశాల్ని పరిగణనలోకి తీసుకుని కనిష్ఠస్థాయిలో కొనుగోలు చేయాలనుకున్న ఇన్వెస్టర్లు సైతం ఆర్థిక మంత్రి ప్రతిపాదనలతో వెనక్కు తగ్గారు.
అప్పటికే అదానీ గ్రూప్లో ఎల్ఐసీ భారీగా చేసిన పెట్టుబడులు హిండెన్బర్గ్ రిపోర్ట్తో తీవ్ర నష్టాలు తేవడంతో కుదేలైన ఈ షేరు మరింత పతనమయ్యింది. 2022 డిసెంబర్తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఎల్ఐసీ నికరలాభాన్ని భారీగా రూ.211 కోట్ల నుంచి రూ. 8,349 కోట్లకు పెంచుకున్నా షేరును కొనేవారే కరువయ్యారు. ఈ సంస్థ 2023 జనవరి-మార్చి త్రైమాసికానికి మే 24న ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎల్ఐసీ షేరు 20 శాతం పతనంకాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50సూచి 0.67 శాతం లాభపడింది.