LIC IPO | కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెంచుకున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో సైజ్ కుదించారు. ఈ మేరకు ఎల్ఐసీ బోర్డు ఐపీవో సైజ్ ఐదు శాతం నుంచి 3.5 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. అంటే ఎల్ఐసీలో రూ.21 వేల కోట్ల విలువైన షేర్లను ఐపీవోలో కేంద్రం విక్రయిస్తుందని సమాచారం. ఎల్ఐసీ సమర్పించిన ఐదు శాతం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్పై సెబీ ఆమోదాన్ని బట్టి సంస్థ ఐపీవో సైజ్ ఖరారవుతుందని సమాచారం.
ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇంతకుముందు ఈ సంస్థ విలువ రూ.17 లక్షల కోట్లని అంచనా వేసిందని సమాచారం. వచ్చేనెల తొలి వారంలో ఎల్ఐసీ ఐపీవో స్టాక్ మార్కెట్లను తాకనుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ ప్రకారం గత నెల చివరిలోగా ఎల్ఐసీ ఐపీవో పూర్తి కావాల్సి ఉంది.కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని, అందువల్లే ఎల్ఐసీ ఐపీవో వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.