న్యూఢిల్లీ, ఆగస్టు 8: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ కోల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 10.1 శాతం తగ్గి రూ.7,941.40 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.8,833.22 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.36,086.68 కోట్ల నుంచి రూ.37,521.03 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 11.67 శాతం ఎగబాకి రూ.26,785.68 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.