Stock Market | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలనే అందుకున్నాయి. ఆఖరిరోజు భారీ నష్టాలనే మూటగట్టుకున్నా.. ఓవరాల్గా మదుపరులు కొనుగోళ్లకు మద్దతు పలికారు. ఫలితంగా అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 641.83 పాయింట్లు ఎగిసి 73,730.16 వద్ద స్థిరపడింది.
అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 272.95 పాయింట్లు పుంజుకొని 22,419.95 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేయవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో పెట్టుబడుల ఉపసంహరణలకు వీలు కనిపిస్తున్నది. అయితే కొంతమేర కొనుగోళ్లకూ దిగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మెజారిటీ విశ్లేషకులు.. సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోను కావచ్చన్న సంకేతాలనే ఇస్తున్నారు.
ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి. చమురు మార్కెట్ తీరుతెన్నులు.. దేశీయ స్టాక్ మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. నిఫ్టీకి 22,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 21,900 మద్దతు స్థాయిగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 22,600-22,800 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా అంటున్నారు.