హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు, రుణాల లింకేజీ చాలా సంక్లిష్టంగా ఉన్నాయని, వాటిని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. అయితే ఎంఎస్ఎంఈల కోసం ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా ‘ప్రేరణ’ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సైతం దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్క్లినిక్ పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని చేపట్టిందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇండియన్ బ్యాంక్ ఇందులో భాగస్వామి కావాలని కోరారు. ‘ప్రేరణ’ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవస్థలో బలహీనుడి పక్షాన నిలబడాలని, సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారని గుర్తుచేశారు. ఆ దిశగానే తమ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. కాగా, అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా బ్యాంక్ సీఈవో, ఎండీ పద్మజ చుండూరుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరి శ్రమల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఎంఎస్ఎంఈలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఉన్నా యి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో తమ బ్యాంకు ఇప్పటికే భాగస్వామ్యం కలిగి ఉన్నది. భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
–పద్మజ చుండూరు, ఇండియన్ బ్యాంక్ సీఈవో, ఎండీ