హైదరాబాద్, నవంబర్ 8: ప్రముఖ విత్తనాల విక్రయ సంస్థ కావేరీ సీడ్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.10.72 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2.72 కోట్లతో పోలిస్తే ఇంచుమించు మూడు రెట్లు పెరిగాయి. గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.96.12 కోట్ల రాబడిని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.84.49 కోట్ల ఆదాయం కంటే ఇది 13.77 శాతం అధికమని పేర్కొంది. ఎబిటా 70 శాతం ఎగబాకి రూ.19.79 కోట్లు ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఆదాయ, లాభాల పరంగా భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. నిర్వాహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.75 శాతం ఎగబాకి రూ.816.44 కోట్ల నుంచి రూ.863.42 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఎబిటా కూడా 15 శాతం వృద్ధితో రూ.298.88 కోట్లకు చేరుకున్నది. నికర లాభం రూ.243.39 కోట్ల నుంచి రూ.278.56 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది.
‘కీలకమైన విత్తన విభాగంలో అత్యుత్తమ వృద్ధిరేటును సాధించాం. వరి, పత్తి విత్తనాలు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకున్నప్పటికీ, వ్యూహాత్మక విధానాలతో ఆదాయంలో అంచనాలకుమించి రాణించగలిగాం. అంతర్జాతీయ మార్కెట్లో వరి ధరలు భారీగా పెరగడం కూడా కలిసొచ్చింది. దీంతో అక్కడ వరి సాగు 11 శాతం వరకు పెరిగింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా తాంజానియా, అల్జేరియా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మధ్య ప్రాచ్య దేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వాటాదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించాం.
– జీవీ భాస్కర్ రావు, కావేరీ సీడ్స్ సీఎండీ