JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది. ఇందుకోసం ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంతో శనివారం ‘ఎంఓయూ’ కుదుర్చుకున్నది.
ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బ్యాటరీల తయారీ కోసం ఒడిశాలోని కటక్లో ఓ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ గ్రూప్ తెలిపింది. ఒడిశాలోని పరాదీప్లో ఎలక్ట్రిక్ విడి భాగాల తయారీ యూనిట్ డెవలప్ చేయనున్నది. రెండు ప్లాంట్ల కోసం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. కటక్ ప్లాంట్లో రూ.25 వేల కోట్లు, పరాదీప్ యూనిట్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది.
కటక్, పరాదీప్ యూనిట్లలో రెండు దశల్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నది. గుజరాత్, తమిళనాడు తరహాలో ఒడిశాలో పూర్తి స్థాయిలో ఈవీల తయారీ యూనిట్లలో ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయనున్నది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో 50గిగావాట్ల ఈవీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. ఈ బ్యాటరీలను కమర్షియల్, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం తయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ యూనిట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం రిఫైనరీ, కాపర్ స్మెల్టర్, ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలను తయారు చేస్తారు.
ఒడిశాలో రెండు ఎలక్ట్రిక్ వాహనాల, వాటి అనుబంధ పరికరాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడంతో 11 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుంది. కటక్లో 4,000 మంది, పరాదీప్ యూనిట్లో ఏడు వేల మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటితోపాటు పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడులు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్కు ఉపకరిస్తాయి. ఆటో కంపోనెంట్స్ సప్లయ్ చైన్, సర్వీస్ రంగాల్లో పుష్కలమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.