JSW-Volkswagen EV Cars | దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్డబ్ల్యూ, జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ జత కట్టాయని తెలుస్తున్నది. రెండు సంస్థలు కలిసి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనున్నాయి. ఇందుకోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేస్తాయి. ఈ విషయమై జేఎస్డబ్ల్యూ ఇండియా, ఫోక్స్వ్యాగన్ సంస్థల మధ్య ఈ నెల ప్రారంభంలో చర్చలు జరుగుతాయని తెలుస్తున్నది. ఇటీవలే ఎలక్ట్రిక్ కార్లు, వాటిని నడపడంలో కీలకమైన బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం ఒడిశా ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. కటక్, పరదీప్ల్లో ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్దని.
తన అనుబంధ కంపెనీ స్కోడా ఆటో ఫోక్స్వ్యాగన్ ఇండియాలో వాటాను విక్రయించే అంశాన్ని ఫోక్స్వ్యాగన్ పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మరో ఆటోమొబైల్ కంపెనీతో కలిసి భారత్లో ఈవీ కార్లను తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ వదంతులపై స్పందించలేమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ అంశంపై ఫోక్స్ వ్యాగన్ సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈవీ కార్లను డెవలప్ చేసేందుకు జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎంజీ మోటార్ ఇండియా మధ్య గత డిసెంబర్లో అంగీకారం కుదిరినట్లు సమాచారం. జాయింట్ వెంచర్లో రెండు సంస్థల వాటా ఎంత అన్నది వెల్లడి కాలేదు. కానీ జేఎస్డబ్ల్యూ గ్రూప్కు 35 శాతం వాటా ఉంటుందని ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్డబ్ల్యూ గ్రూప్ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ సుమారు రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. అటుపై ఫైనాన్సియల్ ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించే అవకాశాలు ఉన్నాయి. ఈ జాయింట్ వెంచర్ విలువ రూ.8,000 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది.