Nirmala Sitaraman | మూడు నెలల క్రితంతో పోలిస్తే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి చేరుకుంటున్నది. దీంతో దేశ ఆర్థిక వృద్ధిరేటు పెంచడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొలువుల కల్పనతోపాటు సంపద జాతికి సమానంగా పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని బుధవారం ఇండియా ఐడియాస్ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చెప్పారు. గ్రోత్ రేట్ పెంపే తమ సర్కార్ ముందు ఉన్న ప్రధమ ప్రాధాన్యం అని స్పష్టం చేశారు.
రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతం కాగా, జూలైలో అది 6.71 శాతంగా నమోదైంది. కొన్ని నెలలుగా కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి వచ్చిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ అదనపు నగదు ముద్రించకుండానే సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించగలిగామని తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు, సహజ వాయువు ధరలపై అనిశ్చితి కొనసాగవచ్చునని రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి కొనసాగొచ్చని అంచనా వేశారు.
డేటా బిల్లుపై ఉన్న అనుమానాలు, ఆందోళనలను కొత్త బిల్లు తొలగిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. వీలైనంత త్వరగా బిల్లును పార్లమెంట్ ముందుకు తెస్తామని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సహాయంతో సమగ్ర బిల్లు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్ బిల్లు-2019పై విపక్షాల నుంచి అభ్యంతరాలు వెల్లడి కావడంతో .. ఆ బిల్లును గత నెలలో పార్లమెంట్ నుంచి ఉపసంహరించుకున్నది.