Bharat GPT-Jio | చాట్జీపీటీ.. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం.. ఓపెన్ ఏఐతోపాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బోట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో సైతం ఈ రంగంలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నది. అందుకోసం ఐఐటీ-బాంబేతో కలిసి ‘భారత్ జీపీటీ’ డెవలప్మెంట్పై పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ముంబైలో జరిగిన ‘టెక్ ఫెస్ట్’లో ఆయన ఈ సంగతి చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రతి రంగంలో ఉత్పత్తులు, సేవల్లో పెను మార్పులు తేవొచ్చు. తమ సంస్థలోని అన్ని విభాగాల్లో ఏఐ సేవలను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీంతోపాటు టెలివిజన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తేవడానికి విస్త్రుత స్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు.
కంపెనీ డెవలప్ మెంట్ కోసం ఒక వ్యవస్థ రూపకల్పన చాలా ముఖ్యమని, జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభించామని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. వచ్చే దశాబ్దిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని చెప్పారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.