ముంబై, డిసెంబర్ 23: తమ్ముడి సంస్థ అన్న గుప్పిట్లోకి వచ్చింది. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్.. ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో వశమైంది. జియో అనుబంధ సంస్థ రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఆర్పీపీఎంఎస్ఎల్).. రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లోని 100 శాతం వాటాను దక్కించుకున్నది.
దాదాపు రూ.3,725 కోట్లకు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్లు, ఫైబర్ ఆస్తులను సొంతం చేసుకున్నది. కాగా, దివాలా తీసిన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ను రూ.3,720 కోట్లతో కొనేందుకు 2019 నవంబర్లోనే జియో ముందుకొచ్చిన విషయం తెలిసిందే.ఈ బిడ్కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రుణదాతలు అంగీకరించారు. ఈ క్రమంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సైతం ఆర్పీపీఎంఎస్ఎల్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ లావాదేవీ తాజాగా పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ ఇన్ఫ్రాటెల్కు 43,540 మొబైల్ టవర్లున్నాయి. దాదాపు 1.78 లక్షల రూట్ కిలోమీటర్ల మేర ఫైబర్ ఆస్తులున్నాయి.