టోక్యో : ఉత్పాదకత పెంచేందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు బర్త్రేట్ పైనా ప్రభావం చూపింది. రాత్రి 8 గంటల తర్వాత పనిచేయడంపై జపాన్కు చెందిన ఇటోచు కార్పొరేషన్ నిషేధం విధించిన పదేండ్ల అనంతరం కంపెనీలో మహిళా ఉద్యోగుల సంతాన సాఫల్య రేటు రెండింతలైంది. కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 2022 నాటికి ఇద్దరు పిల్లల చొప్పున ఫెర్టిలిటీ రేటు పెరిగిందని గుర్తించారు.
జపాన్లో సగటు సంతాన రేటు 1.3ను ఈ కంపెనీ ఉద్యోగినులు అధిగమించారు. ఇటీవల ఉద్యోగులకు వారానికి రెండు రోజులు ఇంటినుంచి పనిచేసేందుకు ఇటోచు అనుమతించడంతో పాటు కార్యాలయ పని గంటలను ఎనిమిది నుంచి ఆరు గంటలకు కుదించింది. 2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మషిహిరో ఒకఫుజి పగ్గాలు చేపట్టినప్పుడు ఉత్పాదకత పెంచడంతో పాటు జపాన్లో తమ ప్రత్యర్ధులకు దీటైన పోటీ ఇచ్చే ఉద్దేశంతో రాత్రి పొద్దుపోయిన తర్వాత పనివేళలను నిషేధించారు.
అరుదైన సందర్భాల్లో మినహా ఓవర్టైమ్ను కూడా రద్దు చేశారు. ఇక ఈ పదేండ్లలో ఫ్యామిలీమార్ట్ నుంచి మెటల్స్ ట్రేడింగ్ వరకూ ఇటోచు లాభాలు ఏకంగా ఐదింతలు పెరిగాయి. 2010 నుంచి 2021 వరకూ ఇబ్బడిముబ్బడిగా కంపెనీ లాభాలను ఆర్జించింది. ఈ క్రమంలో పలువురు మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవులు తీసుకుని పిల్లలను కని తిరిగి పనిచేసేందుకు వచ్చారు. తాము ఉత్పాదకత పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బర్త్ రేట్పై ప్రభావం చూపుతుందని తామనుకోలేదని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబయషి చెప్పుకొచ్చారు.
Read More :