న్యూఢిల్లీ : కరోనా కట్టడికి ఎక్కడికక్కడ అమలవుతున్న లాక్డౌన్ తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను జపాన్ బ్రోకింగ్ దిగ్గజం నోమురా కుదించింది. 2021-22లో భారత వృద్ధి రేటు అంచనాను 12.6 శాతం నుంచి 10.8 శాతానికి కోత విధించింది. కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో 20కి పైగా రాష్ట్రాలు లాక్డౌన్ లేదా లాక్డౌన్ తరహా నియంత్రణలను అమలు చేయడంతో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం ఏర్పడటం వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నోమురా అంచనా వేస్తోంది.
జూన్ క్వార్టర్ లో లాక్డౌన్ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని వృద్ధి రేటు అంచనాలో కోత విధించినట్టు నోమురా పేర్కొంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, అంతర్జాతీయ ఆర్ధిక రికవరీ వంటి సానకూల పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 10.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేయగా సెకండ్ వేవ్ ఇదే తరహాలో వ్యాప్తి చెందితే జీడీపీ పెరుగుదల 8.2 శాతానికి పరిమితమవుతుందని మరికొందరు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.