హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ బిజినెస్): హైదరాబాద్లో జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఓ ప్రత్యే క ఉత్పాదక కేంద్రాన్ని తీసుకొస్తున్నది. దేశీయ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్తో కలిసి దీన్ని నిర్మిస్తున్నది. ఈ క్రమంలోనే బుధవారం మేడ్చల్ సమీపంలోని తునికిబొల్లారం వద్ద ఈ ప్లాంట్కు ఆజాద్ ఇంజినీరింగ్ ఎండీ రాకేశ్ చోప్దార్ శంకుస్థాపన చేశారు. 11,800 చదరపు మీటర్లలో రూ.166 కోట్లతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. భారత్లో మిత్సుబిషికి తొలి ఎక్స్క్లూజివ్ యూనిట్ ఇదే కావడం గమనార్హం.
300 మందికి ఉద్యోగావకాశాలు
ఆజాద్ ఇంజినీరింగ్స్ ఎక్స్లెన్స్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో భాగంగానే ఈ ప్లాంట్ వస్తుండగా, 2024 మధ్యకల్లా తయారీ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. దీంతో కొత్తగా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇక్కడ గ్యాస్-స్టీమ్ ఎయిర్ఫోలిస్ కోసం అత్యంత కీలక, సంక్లిష్ట విడిభాగాలు తయారు కానున్నాయి. జపాన్ మినహా ఇతర దేశాల్లో వీటి కోసం ఆజాద్తో భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నట్టు ఈ సందర్భంగా మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ జపాన్ ఇంజినీరింగ్ అధిపతి రాజారాం రెడ్డి తెలిపారు. ఆజాద్ ఇంజినీరింగ్ మెషినింగ్ సామర్థ్యం అద్భుతమని, క్రిటికల్ కాంపోనెంట్స్ ఈ సంస్థే తమకు అందిస్తున్నదని సంస్థ డిప్యూటీ సీఈవో తనకా తెలియజేశారు.