మధ్యంతర బడ్జెట్కు వేళైంది. పన్ను కోతలు, వడ్డనలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
ఎప్పట్లాగే ఈ పద్దుపైనా సామాన్యులు.. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, అందులోనూ వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఇది ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఏ మేరకు తమ అంచనాల్ని అందుకుంటుందన్న అనుమానాలూ ఉన్నాయి. అసలు బడ్జెట్పైనున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి?
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1న ప్రకటించే ఈ బడ్జెట్.. మధ్యంతర బడ్జెట్. దీంతో సాధారణంగా ఎటువంటి పెద్ద పన్ను సవరణలు ఉండకపోవచ్చనే అంటున్నారంతా. అయినప్పటికీ కొన్ని పన్ను మినహాయింపులను వ్యక్తిగత ట్యాక్స్పేయర్స్ ఆశిస్తున్నారు. ప్రభుత్వం సైతం ఆ దిశగా అడుగులు వేయవచ్చన్న అంచనాలున్నాయి. అవి..
మరింత మంది ట్యాక్స్పేయర్లు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొనేలా.. ఇందులో ప్రోత్సాహ కాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న అంచనాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పన్ను శ్లాబ్స్ను మార్చే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే పన్ను మినహాయింపునకున్న కనీస పరిమితిని ప్రస్తుతమున్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచితే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరటేనని చెప్పుకోవచ్చు. అంతేగాక మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ.7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచవచ్చన్న అంచనాలూ నెలకొన్నాయి.
ఇక పాత పన్ను విధానంలో వివిధ రకాల కోతలు/మినహాయింపులకు వీలున్నది. దీనివల్ల పొదుపు, ఇతరత్రా బీమా, పెన్షన్ పథకాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే కొత్త పన్ను విధానంలో ఏ ట్యాక్స్ డిడక్షన్స్/ఎగ్జెంప్షన్స్ లేవు. దీంతో శ్లాబులు/రేట్లను హేతుబద్ధం చేయడంతోపాటు పొదుపు, ఆరోగ్య సంరక్షణ, రిటైర్మెంట్ వంటి వాటికి ప్రోత్సాహకాలను ట్యాక్స్ పేయర్స్ ఆశిస్తున్నారు. ఎన్నికల వేళ దీనిపైనా కేంద్రం దృష్టి పెట్టి ఉంటుందన్న ఊహాగానాలున్నాయి. ఇక ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000 నుంచి లక్ష రూపాయలకు పెంచవచ్చన్న అంచనాలున్నాయి.
ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కోతల కోసం ప్రస్తుతం ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లో 30కిపైగా సెక్షన్లున్నాయి. ఇవన్నీ కూడా 0.1 శాతం నుంచి 30 శాతం శ్రేణిలో రకరకాల శ్లాబులు, రేట్లతో ఉన్నాయి. ఇదంతా సంక్లిష్టంగా తయారైంది. పన్ను సంబంధిత వివాదాలకూ దారితీస్తున్నది. ఇటీవల ఆయా సెక్షన్ల వర్గీకరణ, వివరణలపై పరిశ్రమ వర్గాలు సైతం అనేక ఆందోళనల్ని వెలిబుచ్చాయి. దీంతో రాబోయే బడ్జెట్లో వీటన్నిటికీ స్పష్టత లభించేలా మార్పులు ఉండవచ్చన్న అంచనాలున్నాయి. ఇందుకోసం సవరణలుంటాయని అంటున్నారు.
ఆలస్యమైన, సవరించిన ట్యాక్స్ రిటర్నుల దాఖలు కోసం ఉన్న గడువులను ఆర్థిక చట్టం 2021తో సవరించారు. అయితే విదేశీ ఆదాయం సైతం భారత్లో పన్నులకు లోబడే ఉంటుంది కాబట్టి ఆ ఆదాయమున్న వ్యక్తిగత ట్యాక్స్పేయర్ల కోసం ట్యాక్స్ రిటర్నుల సవరణలు, వాటి దాఖలుకుండే గడువుల విషయంలో వస్తున్న ఇబ్బందుల్ని తొలగించాలన్న డిమాండ్లున్నాయి. వీటికి ఈ బడ్జెట్లో ఓ పరిష్కారం దొరకవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది.
విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కొనుగోళ్ల కోసం పెట్టుకున్న రుణాలు 2019 జనవరి 1 నుంచి 2023 మార్చి 31 మధ్య ఆమోదం పొందితే సదరు లోన్పై వాహనదారులు చెల్లించే వడ్డీలో షరతులకు లోబడి రూ.1,50,000 రాయితీ పొందవచ్చు. అయితే పర్యావరణ హితం కోసం ఈ అవకాశాన్ని వచ్చే బడ్జెట్లో పొడిగిస్తారన్న అంచనాలున్నాయి. అలాగే సెక్యూరిటీలు, ఇతరత్రా మూలధన ఆస్తుల అమ్మకంపై వర్తించే రకరకాల పన్ను రేట్లను సమన్వయం చేయడం ద్వారా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సరళతరం చేసే వీలుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.