ITI Laptop- Mini PC | లాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్లు అంటే కార్పొరేట్ టెక్ సంస్థలే గుర్తుకు వస్తాయి.. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (Indian Telephone Industries (ITI)`.. టెక్నాలజీ విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగులకు రోజువారీ అవసరాలకు ఉపయోగ పడేలా అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీ నిచ్చేలా.. అత్యుత్తమ క్వాలిటీతో లాప్టాప్, మైక్రో పర్సనల్ కంప్యూటర్ డెవలప్ చేసింది. ఇప్పటికే పలు ఆర్డర్లు గెలుచుకున్నామని తెలిపింది. ‘స్మాష్ (SMAASH)’ బ్రాండ్ కింద వీటిని రూపొందించింది. వాటి డిజైన్, తయారీ కోసం గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఇంటెల్ (Intel)`తో అవగాహనకు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ వార్తలు వెలుగు చూడటంతో సోమవారం ఐటీఐ షేర్లు 20 శాతం లాభంతో 52వారాల గరిష్ట స్థాయిని తాకాయి.
రెగ్యులేటరీ ఫైలింగ్లో ఐటీఐ ఇచ్చిన సమాచారంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్లు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్ఈలో 20 శాతం లాభంతో రూ.149.40 వద్ద, ఎన్ఎస్ఈలోనూ 20 శాతం లబ్ధితో 52 వారాల గరిష్ట స్థాయి రూ.149.30 వద్ద స్థిర పడింది.
ఈ మినీ పర్సనల్ కంప్యూటర్, లాప్ టాప్ తయారీలో ఐ3, ఐ5, ఐ7 తదితర ఇంటెల్ ప్రాసెసర్లు వాడారు. స్మాష్ బ్రాండ్ కింద తయారు చేసిన ఉత్పత్తులు ప్రజలకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఐటీఐ వెల్లడించింది. ఎసెర్, హెచ్పీ, డెల్, లెనెవో వంటి కంపెనీలతో పోటీ పడి టెండర్లు దక్కించుకున్నామని వివరించింది.
కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కేఐటీఈ) నుంచి రెండు టెండర్లు గెలుచుకోవడంతోపాటు దాదాపు 9000 లాప్టాప్లు ఆ రాష్ట్ర పాఠశాలలకు పంపిణీ చేసినట్లు ఐటీఐ తెలిపింది. మరో 12 వేల స్మాష్ పర్సనల్ కంప్యూటర్లను కస్టమర్లు వినియోగిస్తున్నారన్నది. గ్లోబల్ టెక్ కంపెనీలకు పోటీగా టెండర్లు గెలుచుకోవడం సాధారణ విషయం కాదని ఐటీఐ చైర్మన్ డాక్టర్ రాజేశ్ రాయ్ తెలిపారు. తాము తయారు చేసే మైక్రో పర్సనల్ కంప్యూటర్లు గ్రీన్ సొల్యూషన్తో వస్తున్నాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఇస్తాయని తెలిపారు.