Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లపై గత వారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావం కనిపించింది. అయితే ఆఖరి నిమిషంలో అనూహ్యంగా టారిఫ్ల అమలును 90 రోజులపాటు వాయిదా వేయడం నష్టాల తీవ్రతను బాగానే తగ్గించిందని చెప్పాలి. శుక్రవారం లాభాలు మునుపటి రోజుల్లో వాటిల్లిన నష్టాలను పెద్ద ఎత్తునే పూడ్చేశాయి మరి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 207.43 పాయింట్లు పడిపోయి 75,157.26 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 75.90 పాయింట్లు తగ్గి 22,828.55 దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను వెంటాడే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు.
కారణం.. అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ తారా స్థాయికి చేరుకోవడమే. ఫలితంగా అమ్మకాల ఒత్తిడికి వీలుందనే అంటున్నారు. ఇక ఈ వారం ట్రేడింగ్ 3 రోజులే జరుగనున్నది. అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడేలతో సోమ, శుక్రవారాలు మార్కెట్లకు సెలవు. దీంతో మంగళ, బుధ, గురువారాల్లోనే మార్కెట్లుంటాయి. కాగా, ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,300-23,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.