న్యూఢిల్లీ, జనవరి 14: ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం చూస్తున్న యువ నిపుణులకు శుభవార్త. సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్టు ప్రకటించాయి. ఇటీవల ఈ మూడు ఐటీ కంపెనీలు వాటి క్యూ3 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. అలాగే ఈ కంపెనీలు 2021 డిసెంబర్ త్రైమాసికంలో భారీ లాభాల్ని ఆర్జించిన సంగతీ తెలిసిందే.
ఇన్ఫోసిస్ 55,000
దేశంలో రెండో పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 55,000కుపైగా ఫ్రెషర్లను తీసుకుంటున్నది. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ వృద్ధి లక్ష్యాల సాధనకు 55,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకునే గ్లోబల్ హైరింగ్ ప్రొగ్రామ్ను అమలు జరుపుతున్నామన్నారు. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాన్ని పటిష్టంచేయడంపై దృష్టి నిలిపినట్లు ఇన్ఫీ సీఈవో సలీల్ ఫారిఖ్ తెలిపారు.
టీసీఎస్ 34,000
దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్ సైతం భారీ నియమకాల ప్రక్రియ అమలు జరుపుతున్నది. ఫలితాల వెల్లడి సందర్భంగా రిక్రూట్ చేసుకోబోయే ఉద్యోగుల సంఖ్యను కంపెనీ ప్రత్యేకంగా ప్రకటించలేదు. అయితే 2022 మార్చికల్లా 34,000 మంది ప్రెషర్లను తీసుకోనున్నట్లు ఇంతకుముందే ప్రకటించగా, ఆ లక్ష్యం పూర్తయినట్లు టీసీఎస్ చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 2021 డిసెంబర్ నాటికి 5.5 లక్షలు మించింది.
విప్రో 17,500
మరో ఐటీ దిగ్గజం విప్రో ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17,500 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఉద్యోగ నియమకాల్ని పెంచుతామని విప్రో చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంకంటే మొత్తం నియమకాల్లో ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ అధికంగా 70 శాతం వరకూ ఉంటుందన్నారు. 2022-22 ఆర్థిక సంవత్సరంలో 30,000 మంది ఫ్రెషర్లను చేర్చుకుంటామని క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా గోవిల్ తెలిపారు.