దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయం గా వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా?
నష్టాల సాకుతో ప్రైవేటీకరిస్తూ..లాభాల పేరుతో డివిడెండ్లు తీసుకుంటూ జాతి సంపదను కార్పొరేట్లపరం చేసే పన్నాగాలు పన్నుతున్నారా??
కేంద్రంలోని నేటి పాలకుల అడ్డగోలు విధానాలు.. ఎందరో మేధావుల సంకల్పంతో స్థిరపడ్డ సర్కారీ కంపెనీల పునాదుల్ని పెకిలిస్తున్నాయన్న విమర్శలు అంతటా వినిపిస్తున్నాయిప్పుడు.
కుదిరితే అమ్ముకోవడం.. లేకపోతే దండుకోవడం.. ఇదీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంగతి. దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ కార్పొరేట్ల అడుగులకు మడుగులు ఒత్తుతున్న పాలకపక్షం.. అడ్డగోలు విధానాలతో జాతి సంపదను దోచేస్తున్నది. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేయగా.. మరికొన్ని కంపెనీలనూ అదే బాటలోకి తెస్తున్నది.
ప్రమాదంలో 60 కంపెనీలు
దాదాపు 60 ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను వీలుంటే అమ్మడమో.. లేకుంటే మూసేయడమో చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ఎరువులు, టెక్స్టైల్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఔషధ, వాణిజ్య రంగాలకు చెందినవే. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి మోదీ సర్కారు ఓ కొత్త విధానం తెచ్చింది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకేతర రంగంలోని పీఎస్యూలను అమ్మడం లేదా మూసేయాలని చూస్తున్నది. దేశీయ వ్యూహాత్మకేతర రంగంలో సుమారు 175 పీఎస్యూలున్నాయి. వీటిలో 60 సంస్థలను గుర్తించి వాటిని వీలైనంత త్వరలో ప్రైవేట్ కంపెనీలకు విక్రయించాలని, అలా జరుగనిపక్షంలో మూసేయాలని కేంద్రం తీర్మానించింది.
ఖజానాకు పీఎస్యూల కష్టార్జితం
గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల నుంచి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో డివిడెండ్ను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో నమోదైన 67 పీఎస్యూల నుంచి రూ.63,056 కోట్ల ఈక్విటీ డివిడెండ్ను కేంద్రం అందుకోవచ్చంటున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే ఇది 24.7 శాతం అధికం. నాడు రూ.50,583 కోట్ల డివిడెండ్ పీఎస్యూల నుంచి ఖజానాకు చేరింది. ఇక 2018-19లో రూ.29,049 కోట్లే రాగా, దీంతో పోల్చితే వస్తున్నది రెట్టింపునకుపైగా ఉంటుండటం గమనార్హం. నిజానికి 2022-23కుగాను కేంద్ర ప్రభుత్వానికి పీఎస్యూల నుంచి అందే డివిడెండ్ ఇంకా పెరగొచ్చన్న అంచనాలున్నాయి. గెయిల్, హిందుస్థాన్ కాపర్ తదితర ప్రభుత్వ రంగ కంపెనీలు ఇప్పటికీ తమ తుది ఈక్విటీ డివిడెండ్ను ప్రకటించలేదు. ప్రకటిస్తే రూ.63,056 కోట్ల కంటే చాలా ఎక్కువ మొత్తంలోనే డివిడెండ్ కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరనున్నది. ఇక కేంద్రానికి డివిడెండ్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వాటానే ఎక్కువగా తేలుతున్నది. గత ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.18,000 కోట్లు రావచ్చని అంటున్నారు.
తెలంగాణపై కేంద్రం గురి
మొదట్నుంచి తెలంగాణ అంటే గిట్టని నరేంద్ర మోదీ సర్కారు.. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే అడ్డుకుంటున్నది. వివిధ పీఎస్యూలకు చెందిన రూ.40,000 కోట్ల విలువైన ఆస్తులను కేంద్రం అమ్మబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇది సరికాదని, దీనిపై పునరాలోచించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ కూడా రాసినది విదితమే. అయినప్పటికీ తీరు మారని కేంద్రం.. అమ్మేందుకే ముందుకెళ్తున్నది.
అమ్మకానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో..