TCS | ముంబై, జూన్ 24: తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎటువంటి స్కాం జరగలేదని ఐటీ దిగ్గజం టీసీఎస్ స్పష్టంచేసింది. స్టాఫింగ్ సంస్థలు టీసీఎస్లో అంతర్గత డివిజన్ అయిన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ)లో కొందరు ఉద్యోగులకు లంచాలివ్వడం ద్వారా నియామకాలు జరిగాయంటూ మీడియాలో వెలువడిన వార్తలు వాస్తవం కాదని కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. అలాగే రిక్రూట్మెంట్ కార్యకలాపాల్ని ఆర్ఎంజీ నిర్వహించదని, అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని వివిధ ప్రాజెక్టులకు కేటాయించడమే దీని పని టీసీఎస్ తెలిపింది. అవసరమైన ఖాళీలను కాంట్రాక్టర్ల ద్వారా భర్తీ చేస్తామన్నది.
మీడియా కథనాల్లో పేర్కొన్న ఫిర్యాదు..ఆ కాంట్రాక్టర్లు నియమించుకునే కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించినదేనని పేర్కొంది. ఫిర్యాదు అందిన తర్వాత ఆరోపణలపై సమీక్ష జరిపామని వెల్లడించింది. ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని, కంపెనీపై ఆర్థిక ప్రభావం ఉండదని, కాంట్రాక్టులు అందించే కొద్దిమంది వెండార్లు, ఉద్యోగులు కంపెనీ నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన అంశమేనని సమీక్షలో తేలిందని టీసీఎస్ వివరించింది. కంపెనీలోని కీలక వ్యక్తులెవరికీ ఇందులో పాత్ర లేదని తెలిపింది.