Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ హైదరాబాద్లో తమ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అగ్రరాజ్యంలో దిగ్గజ మీడియా, వినోద రంగ సంస్థగా పేరొందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ.. ఐటీ కారిడార్లోని కాపిటల్యాండ్ టవర్లో కొత్తగా ఆఫీస్ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకేసారి 1,200 మందికిపైగా ఉద్యోగులు పనిచేసేలా సువిశాలమైన ఆఫీస్ స్పేస్ను తీసుకున్నది. ఈ ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు.. న్యూయార్క్ పర్యటనలో భాగంగా కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.
ఆ సమయంలోనే తెలంగాణలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రకటించింది. దానికి అనుగుణంగా ఐటీ కారిడార్ రాయదుర్గంలోని కాపిటల్యాండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో కార్యాలయాన్ని నెలకొల్పడం ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ భారతీయ మార్కెట్లోని అపారమైన నైపుణ్యం కలిగిన మానవ నరులను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. హైదరాబాద్ నగరం ఐటీ రంగానికే కాకుండా మీడియా, వినోద రంగానికీ అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండటంతో కంపెనీ వృద్ధికి ఈ పరిస్థితులు దోహదం చేయనున్నాయి.