హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులను దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరానికిగాను వివిధ కంపెనీల నుంచి 929 మంది విద్యార్థులకు 2,066 ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. అంటే ఒక్కో విద్యార్థికి రెండు ఆఫర్లు వచ్చాయన్నమాట. ఈ విషయాన్ని ఐఎస్బీ ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్తోపాటు మొహాలిలో ఉన్న క్యాంపస్లలో చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఆఫ్ మేనేజ్మెంట్(పీజీపీ క్లాస్ ఆఫ్ 2022) విద్యార్థులకు ఆమోదయోగ్యమైన జాబ్ ఆఫర్లు ఇంత పెద్ద ఎత్తున రావడం ఇదే తొలిసారని వెల్లడించింది. సగటు వేతన ప్యాకేజీ రూ.34.07 లక్షలు ఉంది. ఒక్కో విద్యార్థికీ సగటున రెండు ఆఫర్లను మించి వచ్చాయని ఐఎస్బీ ప్రకటన పేర్కొంది. గతేడాది వచ్చిన ప్యాకేజీ రూ.28.21 లక్షల కంటే ఈ ప్లేస్మెంట్ వారంలో 20 శాతం అధికంగా ఆఫర్ వచ్చినట్లు వివరించింది. దాదాపు 270 కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. కన్సల్టింగ్, ఐటీ/ఐటీఈఎస్/టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ/రిటైల్, ఫార్మా/హెల్త్కేర్ రంగాల్లోని కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. ఈ క్లాస్లో 39 శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారని, మొత్తం ఆఫర్లలో 41 శాతం మహిళలకే వచ్చాయని ఐఎస్బీ వెల్లడించింది.
కన్సల్టింగ్: మెకిన్సే, బెయిన్, బోస్టన్, డెలాయిట్, డెలాయిట్ యూఎస్ఐ, యాక్సెంచర్ సొల్యుషన్స్, ప్రైస్వాటర్హౌజ్ కూపర్స్, పీడబ్ల్యూసీ, కేపీఎంజీ, ఈవై ఇండియా
బీఎఫ్ఎస్ఐ: యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్ స్యూస్, ఫస్ట్ ర్యాండ్ బ్యాంక్, బార్క్లేస్, గోల్డ్మెన్ శాక్స్, వెల్స్ ఫార్గోతోపాటు ఇతర సంస్థలు
ఐటీ/ఐటీఈఎస్/టెక్నాలజీ: గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, ఉబర్, సిస్కో, టాటా డిజిటల్, జియో, రోజర్పే, మింత్రా, ఓలా ఎలక్ట్రిక్, నైకా, డ్రీమ్ 11, పేటీఎం