Hyundai IPO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా హ్యుందాయ్ కనీసం 3 బిలియన్ డాలర్ల నిధులనైనా సమీకరించాలని చూస్తున్నది. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.25,000 కోట్లు కావడం గమనార్హం. ఇప్పటిదాకా ఈ స్థాయిలో ఏ సంస్థ కూడా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను సేకరించిన దాఖలాలు లేవు. దీంతో ఈ ఐపీవో వాస్తవ రూపం దాల్చితే భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డును సృష్టించనున్నది. ప్రస్తుతం ఈ రికార్డు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ పేరిట ఉన్నది. 2022లో వచ్చిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ విలువ రూ.21,000 కోట్లు.
ఈ ఏడాది ఆఖర్లో ఈ బడా పబ్లిక్ ఇష్యూను పట్టాలపైకి తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తున్నట్టు సమాచారం. ఐపీవో ద్వారా సంస్థలో 15-20 శాతం వాటాను విక్రయించేందుకు హ్యుందాయ్ కంపెనీ వర్గాలు యోచిస్తున్నట్టు సోమవారం తెలియవచ్చింది. ఈ వాటా అమ్మకంతో 3.3 బిలియన్ డాలర్ల నుంచి 5.6 బిలియన్ డాలర్ల వరకు నిధులను అందుకోవచ్చంటున్నారు. మరోవైపు దీనిపై కంపెనీ వర్గాలను సంప్రదించినా వారు స్పందించేందుకు నిరాకరించారు. కాగా, ప్రస్తుతం దేశీయ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ తర్వాత హ్యుందాయ్దే రెండో స్థానం. 1996లో భారత మార్కెట్లోకి హ్యుందాయ్ ప్రవేశించింది. ఇప్పుడు మార్కెట్లో 13 హ్యుందాయ్ మాడల్స్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 1,366 సేల్స్ పాయింట్లు, 1,549 సర్వీస్ పాయింట్లున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రావాలని కార్పొరేట్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. మొత్తం 66 కంపెనీలు ఐపీవోకు రావాలని చూస్తుండగా, ఇందులో 25 సంస్థలకు ఇప్పటికే సెబీ నుంచి ఆమోదం లభించింది. ఈ ఐపీవోల విలువ రూ.27,190 కోట్లుగా ఉన్నది. మరో 41 సంస్థలు సెబీ అంగీకారం కోసం వేచిచూస్తుండగా, వీటి విలువ రూ.45,576 కోట్లుగా ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మొత్తం కలిపితే రూ.72,000 కోట్లపైమాటే. ఈ ఏడాది ఓలా ఎలక్ట్రిక్, ఆఫీస్, మొబీక్విక్, ప్రోటీ, ఓరావెల్ స్టేస్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ వంటి కొత్త తరం టెక్నాలజీ సంస్థలు ఐపీవోకు రావచ్చన్న అంచనాలున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, పర్యాటక రంగాలకు చెందిన కంపెనీలతోపాటు 15-20 యూనీకార్న్లు సైతం ఐపీవోల రేసులో ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గత ఏడాది 57 సంస్థలు ఐపీవోల ద్వారా రూ.49,434 కోట్ల నిధులను సమీకరించాయి.