న్యూఢిల్లీ, ఆగస్టు 3: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచి భారీగా 3,082 పాయింట్లు (5.57 శాతం) లాభపడింది. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.13.53 లక్షల కోట్లు పెరిగింది.
బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.13,53,337 కోట్లు పెరిగి రూ.2,71,08,367 కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతున్నందున మార్కెట్ పటిష్ఠంగా కోలుకుందని, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తీరుపై స్పష్టతరావడం, క్రూడ్ ధరలు తగ్గడం భారత్కు సానుకూలాంశమని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ ట్రేడింగ్ హెడ్ హరిహరన్ చెప్పారు. మూడు నెలల విరామం తర్వాత విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) తిరిగి ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, అయితే వడ్డీ రేట్ల పెంపుపై శుక్రవారం రిజర్వ్బ్యాంక్ రిజర్వ్బ్యాంక్ నిర్ణయం వెలువడనున్నందున ట్రేడర్లు ఎంపికచేసిన షేర్లపై దృష్టిసారించారని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
టెక్ మహీంద్రా టాపర్
తాజాగా సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 2 శాతం పెరగ్గా, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1 శాతంపైగా లాభపడ్డాయి. మరోవైపు మారుతి సుజుకి, సన్ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీలు 1-2 శాతం మధ్య తగ్గాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 1.28 శాతం పెరగ్గా, టెక్నాలజీ ఇండెక్స్ 1.13 శాతం అధికమయ్యింది. టెలికం, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆటోమొబైల్, మెటల్స్, ఎఫ్ఎంసీజీ సూచీలు క్షీణించాయి.