Invester Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగియడంతో మంగళవారం ఇన్వెస్టర్లు రూ.8.50 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం 1053.10 పాయింట్లు నష్టపోయి 71 వేల పాయింట్ల దిగువన స్థిర పడింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో బలహీనతల వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ పతనం కావడంతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,50,820.81 కోట్లు కోల్పోయి రూ.3,65,97,915.97 కోట్లకు చేరుకున్నది. ఈ నెల 20న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,74,48,736.78 కోట్ల వద్ద స్థిర పడింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ 6.13 శాతంతో గరిష్టంగా నష్టపోయింది. ఎస్బీఐ 3.99, హెచ్యూఎల్ 3.82, యాక్సిస్ బ్యాంక్ 3.41, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.23 శాతం నష్టంతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.95 శాతం నష్టపోయింది. హెల్త్ కేర్ మినహా బీఎస్ఈ ఇండెక్స్ల్లో అన్నీ నష్టాలతో ముగిశాయి. రియాల్టీ 5.46 శాతం, సర్వీసెస్ 4.06, మెటల్ 3.97, ఆయిల్ అండ్ గ్యాస్ 3.96, ఎన్జరీ 3.70 శాతం పతనం అయ్యాయి. కమొడిటీస్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ నష్టాల బాటలో పయనించాయి. హెల్త్ కేర్ ఇండెక్స్ మాత్రమే 1.02 శాతం లాభ పడింది.