Invester Wealth | స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసినట్లే.. ఆయా స్క్రిప్ట్ల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు సంపన్నులు అయ్యారు. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్లకు పైగా లాభ పడ్డారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1344.63 పాయింట్లు లాభంతో 54,318.47 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ-30 ఇండెక్స్లోని అన్ని షేర్లు లాభాలతోనే ముగిశాయి. ఈక్విటీల షార్ప్ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,04,523.65 కోట్లు పెరిగి రూ.2,55,55,447.68 కోట్లకు పెరిగింది.
చైనాలో కరోనా ఆంక్షలు సడలించాయన్న వార్తలు ఆసియ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. హాంకాంగ్, సియోల్, టోక్యో, షాంఘై మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. ఫలితంగా ఈక్విటీలు లాభాలతో ముగిశాయి. ఐదు వారాల నష్టాల తర్వాత స్టాక్స్ బుల్ పరుగు తీశాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా తెలిపారు. టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సన్ అండ్ టర్బో, హెచ్సీఎల్ టెక్నాలసీజ్, మారుతి తదితర స్క్రిప్ట్లు బీఎస్ఈలో లాభ పడ్డాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2.78, మిడ్ క్యాప్ 2.51 శాతం లాభ పడ్డాయి. అన్ని బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లు పైపైకి దూసుకెళ్లాయి. మెటల్ 7.62 శాతం, బేసిక్ మెటీరియల్స్ 4.26, ఇంధనం 4.13, ఆయిల్ అండ్ గ్యాస్ 3.52, టెలికం 3.31, ఇండస్ట్రీయల్స్ 3.14 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో 2624 స్టాక్స్ లాభాల్లో ముగిస్తే 714 స్టాక్స్ నష్టపోయాయి. 124 స్టాక్స్లో ఎటువంటి మార్పు లేదు.