Investers Wealth | అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. కేవలం రెండు సెషన్లలోనే ఇన్వెస్టర్లు రూ.10.7 లక్షల కోట్ల వ్యక్తిగత సంపద కోల్పోయారు. దాదాపు అన్ని స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. యూఎస్ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అదానీ గ్రూప్లో పెట్టుబడులపై ప్రాథమికంగా మదింపు జరుపాలని హిండెన్బర్గ్ పేర్కొనడంతో అదానీ గ్రూప్, దాని అనుబంధ స్టాక్స్ను వదిలించుకునేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు. అదానీ గ్రూప్ సంస్థలు భారీగా తీసుకున్న రుణాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది.
కేవలం రెండు సెషన్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ మూడు శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ నాలుగు శాతం నష్టాలతో సెరిపెట్టుకున్నాయి. రెండు సెషన్లలోనే అదానీ గ్రూప్ సంస్థల నుంచి ఇన్వెస్టర్లు 45 బిలియన్ డాలర్ల సంపద ఉపసంహరించుకున్నారు. మోసపూరిత ఖాతాలతో స్టాక్స్ను ప్రభావితం చేస్తున్నదని హిండెన్బర్గ్ నివేదించింది. పన్ను ఆదాలో పెట్టుబడికి స్వర్గధామాలుగా ఉన్న దేశాల మార్కెట్లను అదానీ గ్రూప్ దుర్వినియోగం చేస్తున్నదని, ఈ గ్రూప్ అధిక రుణాలు ఆందోళనకరం అని పేర్కొంది.
దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ ఇంట్రా డే ట్రేడింగ్లో 5-25 శాతం మధ్య నష్టాలతో ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులతోపాటు అత్యధిక బ్యాంకుల నుంచి భారీగా అదానీ గ్రూప్ రుణాలు తీసుకున్నదని హిండెన్బర్గ్ నివేదించింది. మొత్తం గ్రూప్ రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 30 శాతం ఉండొచ్చునని అంచనా వేసింది.అదానీ గ్రూప్ సంస్థలతోపాటు మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి హెవీ వెయిట్స్ కూడా భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.