న్యూఢిల్లీ, జూన్ 13: పలు ప్రతికూలాంశాల కారణంగా అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్ స్టాక్ సూచీలు కుప్పకూలాయి. అమెరికా ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠం 8.6 శాతానికి చేరడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భారీగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయి. దీంతో అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ట్రెండ్ను ప్రతిబింబిస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 1,457 పాయింట్లు పడిపోయి 52,847 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 427 పాయింట్లు క్షీణించి 15,774 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి మారకపు విలువ ఆల్టైమ్ కనిష్టస్థాయి 78 దిగువకు పతనంకావడం సైతం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అమెరికా ఫెడ్ కమిటీ జూన్ 15న వడ్డీ రేట్లను ఏకంగా 0.75 శాతం పెంచుతుందన్న భయాలు మార్కెట్లో ఏర్పడ్డాయని, ఈ రేట్ల పెంపు వచ్చే ఏడాది సైతం కొనసాగుతుందన్న అంచనాలు నెలకొన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం 3 శాతం అమెరికా స్టాక్ సూచీలు క్షీణించగా, సోమవారం సైతం భారీగా తగ్గాయి. చైనాలో తాజాగా కొవిడ్ కేసులు పెరిగాయన్న వార్తలు తోడవ్వడంతో టోక్యో, సియోల్, హాంకాంగ్, షాంఘై ఇండెక్స్లు 1-3 శాతం మధ్య పతనమయ్యాయి. యూరప్లోని ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు క్షీణబాటలో ఉన్నాయి.
బజాజ్ ఫిన్సర్వ్ టాప్ లూజర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్సర్వ్ 7 శాతం క్షీణించింది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐలు 3-6 శాతం మధ్య తగ్గాయి. సెన్సెక్స్ ప్యాక్లో నెస్లే ఇండియా మాత్రమే స్వల్పంగా లాభపడింది. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ భారీగా 3.92 శాతం పడిపోయింది. టెక్నాలజీ ఇండెక్స్ 3.45 శాతం, మెటల్ సూచి 3.39 శాతం, ఇండస్ట్రియల్స్ 3.35 శాతం, ఫైనాన్స్ ఇండెక్స్ 3.17 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 3.12 శాతం చొప్పున తగ్గాయి.
రెండు రోజుల్లో రూ.9.75 లక్షల కోట్లు
వరుసగా రెండు రోజుల భారత్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. శుక్ర, సోమ వారాల్లో సెన్సెక్స్ 2,472 పాయింట్లు పడిపోయింది. దీంతో ఈక్విటీ ఇన్వెస్టర్లు రూ.9.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.9,75,890 కోట్లు తగ్గి రూ.2,45,19,673 కోట్లకు దిగింది.