ముంబై, మార్చి 3: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీకి తోడు విదేశీ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు ఇంతటి స్థాయి లాభాలను నిలుపుకోలేక పోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 899.62 పాయింట్లు లేదా 1.53 శాతం ఎగబాకి మళ్లీ 59 వేల మార్క్ను దాటి 59,808.97 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 272.45 పాయింట్లు లేదా 1.57 శాతం అధికమై 17,594.35 వద్ద స్థిరపడింది. గత పది సెషన్లలో లక్షల కోట్ల సంపదను కోల్పోయిన మదుపరులు ఎట్టకేలకు భారీ స్థాయిలో సంపదను పోగేసుకున్నారు. శుక్రవారం వీరి సంపద రూ.3.43 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,43,173.59 కోట్లు పెరిగి రూ.2,63,42,218.11 కోట్లకు చేరుకున్నది.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 5.11 శాతం లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది ఎయిర్టెల్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, టైటాన్, ఎల్అండ్టీ, మహీంద్రాఅండ్మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్ షేర్లు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి.వీటితోపాటు యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్గ్రిడ్, టీసీఎస్, హెచ్యూఎల్, విప్రో, మారుతి, ఇన్ఫోసిస్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల మద్దతు లభించింది.
కానీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, నెస్లె ఇండియాలు నష్టపోయాయి.
అదానీ గ్రూపునకు చెందిన నాలుగు సంస్థల్లో రూ.15,446 కోట్లతో మైనార్టీ వాటాను అమెరికాకు చెందిన జీక్యూజీ పార్టనర్ కొనుగోలు చేయడంతో ఈ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఏకంగా 17 శాతం లాభపడింది.రంగాలవారీగా చూస్తే సర్వీసెస్ 3.17 శాతం, బ్యాంకెక్స్ 2.13 శాతం, యుటిలిటీ 1.84 శాతం, ఆర్థిక సేవలు 1.76 శాతం, కమోడిటీస్ 1.69 శాతం, పవర్ 1.60 శాతం చొప్పున పెరిగాయి.