Pharma Villages | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఫార్మా విలేజ్ల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి నెల గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేదు.
ఫార్మా పరిశ్రమలు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలోని నలువైపులా పెడతామని ప్రభుత్వం ప్రకటించింది కానీ, ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన రూపొందించ లేదు. దీంతో పరిశ్రమ ఏర్పాటుపై పెట్టుబడిదారులు సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు చేపట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
కానీ, సరైన ప్రణాళికలు లేక ప్రభుత్వ ఆలోచనలు ముందుకు సాగడంలేదు. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో పది ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవల బయోఏషియా సదస్సులో ప్రకటించారు. తొలుత వికారాబాద్, మెదక్, నల్లగొండలో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో విలేజ్ 1,000 నుంచి రెండు వేల ఎకరాల్లో నెలకొల్పనున్నట్టు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు.
ఫార్మా పరిశ్రమలు ఒకేచోట పెడితే ఆ ప్రాంతమంతా కాలుష్యమవుతుందని, కాలుష్యానికి తావులేని విధంగా రాష్ట్రం నలుదిక్కులా ఫార్మా విలేజ్లు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఫార్మా విలేజ్ను 1000 నుంచి 2000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ జిల్లాల్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు ఒకేచోట అందుబాటులో లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఒకవేళ రైతుల నుంచి భూములను సేకరించాల్సివస్తే.. అది సరికొత్త తలనొప్పులకు దారితీస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు, ఇప్పటికే జీడిమెట్ల, బాలానగర్, శామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమలు కొలువుదీరాయి. జీనోమ్ వ్యాలీలో అనేక ఆర్అండ్డీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఫార్మా పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్టం అభివృద్ధి చెందింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నగరానికి దూరప్రాంతంలో వేర్వేరు చోట్ల ఫార్మా విలేజ్లను ప్రతిపాదించడం పట్ల పరిశ్రమవర్గాలు పెదవి విరుస్తున్నాయి.
పర్యావరణ అనుమతులకు ఇబ్బందులు
తొలిదశలో మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటుచేస్తామని సీఎం ప్రకటించడంతో పరిశ్రమలశాఖ అధికారులు ఆయా జిల్లాల్లో భూముల వేటలో పడ్డారు. పరిశ్రమలకు అనువైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. భూముల ఎంపిక తర్వాత ఫార్మా విలేజ్ల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు.
ఆ జిల్లాల్లో పెద్దమొత్తంలో ప్రభుత్వ భూములు లేకపోవడం ఒక ఎత్తైతే, ఔషధ పరిశ్రమల ఏర్పాటు పట్ల స్థానికులు ఏ విధంగా స్పందిస్తారో అధికారులను వేధిస్తున్న ప్రశ్న. రైతుల నుంచి భూములు సేకరించాలంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భూములు సేకరించినప్పటికీ వాటికి పర్యావరణ అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. కేంద్రం నుంచి ఈ అనుమతులు తేవడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ.
ఒకవేళ అన్నీ సవ్యంగా సాగి ఫార్మా విలేజ్ సిద్ధమయినా… ఎయిర్పోర్టుకు దూరంగా ఉండే ఫార్మా విలేజ్ల పట్ల కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయో అనేది అంతుబట్టకుండా ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఫార్మా క్లస్టర్లను ఏర్పాటుచేసి భారీ రాయితీలతో కంపెనీలను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఫార్మా విలేజ్ల భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అన్నీ సిద్ధంగా ఉన్నా… ప్రభుత్వ నిరాసక్తత
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల పరిధిలో ఫార్మాసిటీని గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. ఫార్మాసిటీని సుమారు 16,000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దాదాపు 13,000 ఎకరాల వరకు భూసేకరణ కూడా పూర్తయింది. తొలిదశలో సుమారు 10 వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, దీనికి పర్యావరణ అనుమతులు కూడా లభించాయి.
350కిపైగా కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరిశ్రమల ఏర్పాటునకు కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంతలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మాసిటీని రద్దు చేసింది. ప్రస్తుతానికి ఫార్మాసిటీ ప్రతిపాదనను పక్కకుపెట్టాలని, తాము సరికొత్త ప్రతిపాదనతో వస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఫార్మా పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దేశంలోనే ఔషధ రాజధానిగా, ప్రపంచానికే వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్న హైదరాబాద్ నగరం… మున్ముందు ఫార్మా రంగంలో ఏ మేరకు పురోగతి సాధిస్తుందో అంతుబట్టడంలేదని వారు పేర్కొంటున్నారు.